iDreamPost

వెంటిలేటర్‌పై మాజీ ఎంపీ సబ్బంహరి

వెంటిలేటర్‌పై మాజీ ఎంపీ సబ్బంహరి

తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కరోనా బారినపడిన ఆయన వైజాగ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఈ నెల 15వ తేదీన సబ్బం హరి కరోనా బారినపడ్డారు. వైరస్‌ సోకిన విషయం నిర్థారణ అయిన తర్వాత హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే వైరస్‌ తగ్గకపోగా.. ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన బుధవారం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కరోనా వైరస్‌తోపాటు.. ఇతర ఇన్ఫెక్షన్లు సోకడంతో సబ్బం హరి ఆరోగ్యం మరింత విషమించింది.

కాంగ్రెస్‌ హాయంలో విశాఖ మేయర్‌గా పని చేసిన సబ్బం హరి ఆ తర్వాత దిగవంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలువతో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. వైఎస్‌ఆర్‌ అకాల మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌కు మద్ధతుగా మాట్లాడేవారు. ఆ తర్వాత కొద్ది కాలానికే వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తూ.. 2014 ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 6,644 ఓట్లు పొందారు.

2014 ఎన్నికల తర్వాత ఏ పార్టీలోనూ చేరని సబ్బం హరి.. రాజకీయ విశ్లేషకుడుగా కొనసాగారు. న్యూస్‌ ఛానెళ్ల చర్చల్లో టీడీపీకి అనుకూలంగా, వైసీపీ వ్యతిరేకంగా మాట్లాడేవారు. కొన్నాళ్లకు టీడీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2019 సాధారణ ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై ఓడిపోయారు. సబ్బం హరి టీడీపీలోనే ఉన్నా.. కొన్ని మీడియా సంస్థలు ఆయన్ను రాజకీయ విశ్లేషకుడిగానే పిలుస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి