iDreamPost

అవినీతి ఆరోపణలపై అచ్చం నాయుడు అరెస్ట్

అవినీతి ఆరోపణలపై  అచ్చం నాయుడు అరెస్ట్

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడును అవినీతి నిరోధక శాఖ అరెస్ట్‌ చేసింది. ఈ రోజు ఉదయం అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడ వెళ్లిన ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేశారు. దాదాపు 300 మంది అధికారులతో వెళ్లిన ఏసీబీ ఐదు నిమిషాల్లో ప్రక్రియ పూర్తి చేసింది. రోడ్డు మార్గాన ఆయన్ను విశాఖకు తీసుకొస్తున్నారు. విశాఖ కోర్టులో హాజరు పరచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన అరెస్ట్‌ను విశాఖలో ప్రకటించనున్నట్లు ఏసీబీ తెలిపింది. ఈఎస్‌ఐ స్కాంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్‌ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేశారు.

Read Also : అచ్చెన్నాయుడు ను కిడ్నాప్ చేశారు.. సీఎం బాధ్యత వహించాలి: చంద్రబాబు

చంద్రబాబు ప్రభుత్వ హయంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందులు, ల్యాబ్‌ పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. 988 కోట్ల రూపాయల కొనుగోళ్లలో అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు ఏసీబీ తేల్చింది. నామినేషన్‌ పద్ధతిలో రెండు కంపెనీలకు మందులు, ల్యాబ్‌ పరికరాల సరఫరా కాంట్రాక్టును అచ్చెన్నాయుడు తన లెటర్‌ హెడ్‌పై సిఫార్సు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఒకే లెటర్‌ హెడ్‌పై రెండు కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో 150 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఇప్పటికే నిర్థారించింది. ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు తర్వాత కార్మిక శాఖ బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ భావిస్తోంది. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించేందుకు ఏసీబీ సిద్ధమవుతోది.

Read Also:ఏ ట్వీట్లు చూసి వణికిపోతారు లోకేష్ బాబూ?

ఈఎస్‌ఐ స్కాంలో మొత్తం 40 మంది అధికారుల పాత్ర ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలో వరుసగా అరెస్ట్‌లు చేయడం ప్రారంభించింది. టెక్కలిలో అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు తిరుపతిలో ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ రమేష్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు.

ఈఎస్‌ఐ కుంభకోణం వెలుగులోకి వచ్చిన సమయంలో తన ప్రమేయంపై అచ్చెన్నాయుడు తోసిపుచ్చారు. ప్రధాని మోదీ చెప్పిన మేరకు టెలిమెడిసిన్‌ అభివృద్ధికే తాను పని చేశానని చెప్పుకొచ్చారు. ఇలా అయితే ప్రధాని మోదీదే తప్పు అనేలా మాట్లాడారు. తెలంగాణలో కూడా ఈఎస్‌ఐ కుంభకోణం జరిగింది కాబట్టి అక్కడ కార్మిక శాఖ మంత్రి కూడా అవినీతి చేసినట్లేనా..? అని ప్రశ్నించారు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన దాదాపు నాలుగు నెలల తర్వాత పూర్వాపరాలు నిర్థారించుకున్న ఏసీబీ ఈ రోజు నుంచి అరెస్ట్‌లకు దిగింది.

Read Also:అచ్చెం నాయుడికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఎలా వొచ్చింది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి