iDreamPost

సెట్లో రచయితకు అంత అవకాశం ఉంటుందా

సెట్లో రచయితకు అంత అవకాశం ఉంటుందా

పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో రూపొందుతున్న అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ సగం షూటింగ్ పూర్తయ్యిందని తాజా సమాచారం. భారీ బడ్జెట్, విదేశీ లొకేషన్లు, విజువల్ ఎఫెక్ట్స్ ఇవేవి అవసరం లేని సినిమా కావడంతో వీలైనంత వేగంగా ప్రొడక్షన్ ని పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో సాగుతున్నారు. కొన్ని కీలక మార్పులతో ఒరిజినల్ వెర్షన్ ని మించేలా దీన్ని తీర్చిదిద్దినట్టు ఇప్పటికే టాక్ ఉంది. ముఖ్యంగా పవన్ రానాల మధ్య కాంబినేషన్ సీన్లు ఓ రేంజ్ లో పండాయని యూనిట్ సభ్యుల నుంచి వినిపిస్తున్న మాట. మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యామ్ లతో ఈ సినిమాకు గట్టి పోటీనే ఉండబోతోంది.

ఇక అసలు విషయానికి వస్తే ఈ షూటింగ్ లో దర్శకుడు సాగర్ కె చంద్ర కంటే రచయితగా వ్యవహరిస్తున్న త్రివిక్రమే అంతా తానై వ్యవహరిస్తున్నట్టు ఇండస్ట్రీతో పాటు మేకింగ్ వీడియో చూశాక ప్రేక్షకుల్లోనూ గుసగుసలు మొదలయ్యాయి. ఎంత పవన్ అంటే అభిమానం ఉన్నా, ఎంత ప్రాణ స్నేహితుడైనా సరే ఇలా డైరెక్టర్ ని కాదని మరీ ఇంతగా ఒక రైటర్ కు ఏ సెట్లోనూ డామినేట్ చేసే అవకాశం ఇవ్వరని అంటున్నారు. చాలా షాట్స్ లో సాగర్ చంద్ర కంటే ఎక్కువ త్రివిక్రమే కనిపించడం ఈ విమర్శలకు దారి తీసింది. సోషల్ మీడియాలో ఆయన అభిమానులే కొందరు అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం.

దగ్గరుండి అన్నీ చూసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఈ సినిమా నిర్మిస్తున్న సితార బ్యానర్ లో త్రివిక్రమ్ భాగస్వామి. అలా అని అన్నీ తన చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదనేది వాళ్ళ ప్రశ్న. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సినిమాలు తీసిన సాగర్ చంద్రకు ఎలాంటి గైడెన్స్ అవసరం లేదు.తనకంటూ ఒక శైలి ఉంది. అది మర్చిపోయి త్రివిక్రమ్ సెట్లలో ఉంటున్నారని కొందరి కంప్లయింట్. అక్కడ వాస్తవంగా ఏం జరుగుతోందో కానీ మొత్తానికి మేకింగ్ వీడియో వచ్చాకే ఇది మొదలుకావడం గమనార్హం. త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా తాలూకు కీలక అప్ డేట్ రేపు వచ్చే అవకాశం ఉంది

Also Read : ఇద్దరు టాప్ స్టార్ల సినిమాల్లో కీలక పాత్రలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి