iDreamPost

కష్టపడి SBI బ్యాంక్‌ మేనేజర్‌ కొలువు సాధించాడు.. కానీ ఇంతలోనే

  • Published Aug 21, 2023 | 10:37 AMUpdated Aug 21, 2023 | 10:37 AM
  • Published Aug 21, 2023 | 10:37 AMUpdated Aug 21, 2023 | 10:37 AM
కష్టపడి SBI బ్యాంక్‌ మేనేజర్‌ కొలువు సాధించాడు.. కానీ ఇంతలోనే

ప్రభుత్వ ఉద్యోగం.. అందునా బ్యాంక్‌ జాబ్‌ సాధించడం అంటే అంత సులభం కాదు. బ్యాంక్‌ పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఏళ్ల తరబడి.. పగలు రాత్రి తేడా లేకుండా.. కష్టపడి చదివినా కూడా ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదు. అంత కష్టపడి చదివి, ఉద్యోగం సంపాదించిన తర్వాత.. వారి సంతోషం అంతా ఇంతా కాదు. అవును మరి ఆ ఉద్యోగం కోసం ఎన్ని నిద్రలు లేని రాత్రలు గడిపారో వారికే తెలుసు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఇలానే కష్టపడి చదివి.. ఎస్‌బీఐ బ్యాంక్‌ మేనేజర్‌గా కొలువు సాధించాడు. మరి అంత మంచి ఉద్యోగం సాధించిన ఆ వ్యక్తి.. దారుణ నిర్ణయం తీసుకున్నాడు. కారణం ఏంటి అంటే..

పనిఒత్తిడి భరించలేక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌గా పని చేస్తోన్న వ్యక్తి.. ఆత్మహత్య చేసుకున్నాడు. వాంకిడి శాఖ మేనేజర్‌ పురుగుల మందు తాగడంతో.. అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో హస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఎస్సై సాగర్‌ వివరాల ప్రకారం.. జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన జనోత్‌ సురేష్‌ రెండేళ్ల క్రితం వాంకిడి మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌లో మేనేజర్‌గా వచ్చాడు. అయితే సురేష్‌ పని చేసే దగ్గర.. ఫీల్డ్‌ ఆఫీసర్‌ లేకపోవడంతో.. అతడి విధులు సైతం సురేషే నిర్వహిస్తూ.. పై అధికారుల ఒత్తిడికి గురయ్యాడు.

పని ఒత్తిడి భరించలేక..

ఇద్దరి పని ఒక్కడే చేస్తుండటంతో.. డ్యూటీ తర్వాత ఇంటికి వెళ్లిన సురేష్‌ నీరసంగా ఉండేవాడు. దీని గురించి పై అధికారులకు చెప్పినా లాభం లేకపోయిందని సమాచారం. ఈ క్రమంలో పని ఒత్తిడి భరించలేక దారుణ నిర్ణయం తీసుకున్నాడు సురేష్‌. గురువారం విధులకు వెళ్లిన తర్వాత సాయంత్రం 7.30గంటల సమయంలో బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయాత్నం చేశాడు సురేష్‌. కొద్ది సేపటికి అతడు వాంతులు చేసుకోవడం గమనించిన బ్యాంకు సిబ్బంది.. వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు సురేష్‌. మృతుడి తండ్రి లక్ష్మిరాజం ఫిర్యాదు మేరకు కేసు ఫిర్యాదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

స్వగ్రామంలో తీవ్ర విషాదం..

ఎస్‌బీఐ బ్యాంక్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోన్న బానవత్‌ సురేశ్‌ (35) ఆత్మహత్యకు పాల్పడటంతో.. స్వగ్రామలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చింతగూడ గ్రామానికి చెందిన బనావత్‌ లక్ష్మి రాజం, విజయ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు. ఇందులో సురేశ్‌ పెద్దవాడు. అందరికి వివాహం జరిగింది. సురేశ్‌ బ్యాంక్‌ క్యాషియర్‌గా ఉద్యోగం సాధించాడు. సురేష్ వేర్వేరు ప్రాంతాల్లో క్యాషియర్‌గా, సబ్‌ మేనేజర్‌గా వివిధ హోదాల్లో ఉద్యోగం చేస్తూ సంవత్సరం క్రితం వాంకిడి మండలానికి మేనేజర్‌గా బదిలీ అయ్యాడు. ఇక సురేష్‌కు భార్య ప్రియాంక, కొడుకు విరాన్ష్‌(4)ఉన్నారు. సురేశ్‌ మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి