iDreamPost

ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తున్న కరోనా

ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తున్న కరోనా

కరోనా ఇప్పుడు దక్షిణ కొరియాను వణికిస్తుంది.. చైనా తరువాత అత్యధికంగా దక్షిణ కొరియాలో ఈ వైరస్ వ్యాపిస్తుంది.దక్షిణ కొరియాలో దాదాపు 3000 వేల మందికి ఈ వ్యాధి వ్యాప్తి చెందగా ఇప్పటికే 16 మంది మరణించారు.

కాగా చైనాలో ప్రధానంగా కేంద్రీకృతం అయిన ఈ వైరస్ క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరిస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ బాధితుల సంఖ్య దాదాపు 80000 కు చేరువగా ఉంది. సాధారణ జనజీవనం చైనాలో స్తంభించిపోయింది. రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో 5కోట్ల 60 లక్షలమంది ప్రజలు గృహ నిర్బంధంలో ఉన్నారు.

దక్షిణ కొరియాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో వైరస్ ఉత్తర కొరియాలో వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో ఉదాసీనత కనబరిచినట్లు ఆరోపణలు రావడంతో అధికార వర్కర్స్‌ పార్టీ వైస్‌ ఛైర్మన్‌ రీ మాన్‌ గొన్‌, పాక్‌ తే డొక్‌ను పదవి నుంచి తప్పించినట్లు అధికారులు తెలిపారు. వైరస్‌ దేశంలోకి వచ్చే అవకాశం ఉన్న అన్ని మార్గాల్ని మూసివేయాలని కిమ్‌ అధికారులను ఆదేశించారు.

ఐరోపాలో కరోనా వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇటలీకి వెళ్లోద్దని అమెరికా పౌరులను ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. ఇటలీలో కరోనా వల్ల 17 మంది మరణించగా, మరో 670 మందికి వైరస్ వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు.

పవిత్ర స్థలాలయిన మక్కా మదీనాలకు యాత్రికులను అనుమతించకూడదని సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కోఆపరేషన్ సభ్య దేశాల పౌరులను కూడా అనుమతించబోమని సౌదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

కాగా కరోనా (కోవిడ్19) వైరస్ వల్ల,ఏర్పడిన భయాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో కొన్ని నిమిషాల్లోనే సుమారు 5 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరై పోయింది. తద్వారా ప్రపంచ జీడీపీ 1% తగ్గుతుందని ఆర్థికనిపుణులు అంచనా వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి