iDreamPost

దేశంలో విజృంభిస్తున్న కరోనా-42 వేలకు చేరిన పాజిటివ్ కేసులు

దేశంలో విజృంభిస్తున్న కరోనా-42 వేలకు చేరిన పాజిటివ్ కేసులు

1373 కి చేరిన కరోనా మరణాలు

దేశవ్యాప్తంగా గడచిన 48 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు ఉధృతంగా పెరిగాయి. కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తూ ఉండటం ఆందోళన కలిగించే పరిణామంగా చెప్పుకోవచ్చు. గడచిన 48 గంటల్లో 4898 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,533కు చేరింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2553 కేసులు నిర్దారణ అయ్యాయి. కాగా కరోనా కారణంగా 1373 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 11,707 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.  గడచిన రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 5 వేల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడం వల్ల దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 12,974 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 548మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 2115 మంది వైరస్ బారినుండి పూర్తిగా కోలుకున్నారు. గుజరాత్‌లో కూడా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటివరకు 5428 కేసులు నమోదవ్వగా, 290 మంది మృతిచెందారు. 1042 మంది డిశ్చార్జి అయ్యారు.    

తెలంగాణలో 1082 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 490 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 29 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1583 మందికి కరోనా సోకగా 33 మంది మృత్యువాత పడ్డారు. 488 మంది వ్యాధి నుండి కోలుకున్నారు. నిన్న 58 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా 3,567,001 మందికి కోవిడ్ 19 సోకగా 248,312 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,157,009 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,188,421 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 68,602 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి