iDreamPost

సమ న్యాయం పాటిస్తున్న సీఎం జగన్‌

సమ న్యాయం పాటిస్తున్న సీఎం జగన్‌

రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యమని మూడు రాజధానులను ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌.. పరిపాలనలో కూడా మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేస్తున్నారు. దేశ చరిత్రలోనూ భారీ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం వైఎస్‌ జగన్‌.. మూడు ప్రాంతాలకు తానే వెళ్లి పట్టాలను పంపిణీ చేస్తున్నారు. తద్వారా అభివృద్ధే కాదు, పరిపాలనలో కూడా మూడు ప్రాంతాలకు సమాన హోదా దక్కేలా పని చేస్తున్నారు.

ఈ నెల 25వ తేదీన 30.75 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ నెల 28వ తేదీన రాయలసీమలోని చిత్తూరు జిల్లాకు వెళ్లారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ రోజు ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాకు వెళ్లారు. విజయనగరం రూరల్‌ మండలం గుంకలాం వద్ద 397.36 ఎకరాల్లో వేసిన లే అవుట్‌లో ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర.. మూడు ప్రాంతాలలోనూ ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. మూడు ప్రాంతాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి తన లక్ష్యమని చెప్పకనే చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లోనే సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచనను వెల్లడించారు. మూడు ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యమంటూ.. ఉత్తరాంధ్రలోని విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కోస్తాలోని అమరావతిలో శాసన రాజధాని, రాయలసీమలోని కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు సంకల్పించారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ ఏపీ హైకోర్టులో ప్రస్తుతం తుది విచారణలో ఉన్నాయి. కొత్త సంవత్సరంలో మూడు రాజధానుల ఏర్పాటుకు నాంధిపడనున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలను మూడు ప్రాంతాల్లోనూ నిర్వహించడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి