iDreamPost

అమరావతి భూ బాగోతం.. ఉచ్చు బిగిస్తున్న సీఐడీ.. మరో ఏడుగురుపై కేసులు

అమరావతి భూ బాగోతం.. ఉచ్చు బిగిస్తున్న సీఐడీ.. మరో ఏడుగురుపై కేసులు

అమరావతి లో జరిగిన భూ బాగోతంలో దోపీడిదారులకు ఉచ్చు బిగిస్తోంది. ఇన్‌సైడర్‌పై ఇటీవల దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఇప్పటికే మాజీ మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులపై కేసులు నమోదు చేసింది.

తాజాగా ఈ రోజు మరో ఏడుగురుపై కేసులు నమోదు చేసింది. అబ్ధుల్‌ జమేదార్, పొలినేని కొండలరావు, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహారావు, భూక్యా నాగమణి తదితరులపై కేసులు నమోదు చేసింది. వీరందరూ తెల్లరేషన్‌ కార్డుల ద్వారా అమరావతిలో భూములు కొన్నారంటూ సీఐడీ అభియోగాలు మోపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే.. దాని చుట్టుపక్కల గ్రామాల్లో టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు వేలాది ఎకరాలు కారు చౌకగా భూములు కొన్నారంటూ ఆరోపణలొచ్చాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ ఆరోపణలు నిజమంటూ తేల్చింది. 4070 ఎకరాలు ఇన్‌సైడర్‌ ద్వారా టీడీపీ నేతలు, అప్పటి ప్రజా ప్రతినిధులు కొన్నారంటూ ఆధారాలతో సహా సేకరించింది. అంతేకాకుండా దాదాపు 791 మంది తెల్లకార్డుదారులు కోట్లు విలువజేసే బూములు కొన్నారని తేల్చింది. వీరందరూ బినామీలైఉంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అమరావతి ఇన్‌సైడర్‌ వ్యహారంపై ఇటీవల జరిగిన అసెంబ్లీలో కూడా దుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచాయి. ఈ నేపథ్యంలో ఇన్‌సైడర్‌ వ్యవహారాన్ని నిగ్గుతేల్చే బాధ్యత ప్రభుత్వంపై పడింది. ఈ మేరకు ఇన్‌సైడర్‌పై దర్యాప్తు చేయించాలని రాష్ట్ర మంత్రివర్గంలోనూ, అసెంబ్లీలోనూ తీర్మానాలు చేసింది. లోకాయుక్త, లేదా సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో చేయించాలని ప్రభుత్వం భావించింది.

అయితే ఇదే సమయంలో రాజధాని గ్రామాలకు చెందని లక్ష్మీ అనే మహిళ తన భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన సీఐడీ.. విచారణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే మొదట మాజీ మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులపై కేసు నమోదు చేయగా.. తాజాగా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసింది. రాబోయే రోజుల్లో మరింత మంది పేర్లు ఇన్‌సైడర్‌ వ్యవహారంలో బయటకు వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి