Idream media
Idream media
ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నఏపీ బిజెపి నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. మూడు రాజధానులపై ఎలా స్పందించాలో తెలిపారు. ఏపీ రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం రావాల్సి ఉందన్నారు.
అధికారిక నిర్ణయం రాకముందే ఏపీ బీజేపీ నేతలు మాట్లాడడం, విమర్శించడం తగదని హితవు పలికారు. రాష్ట్రం, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించిన తర్వాత తమ పార్టీ అభిప్రాయం చెబుతామన్నారు. మూడు రాజధానులు అంశంపై కమిటీ నివేదిక వచ్చాక, విధివిధానాలు తేలిన తర్వాతే తమ అభిప్రాయం చెప్తామని కిషన్రెడ్డి అన్నారు. అప్పటి వరకు బీజేపీ నాయకులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.
కాగా, ఏపీలో వికేంద్రీకరణకు మొగ్గుచూపుతూ జీఎన్ రావు కమిటీ కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. బీసీజీ నివేదిక వచ్చిన తర్వాత ఈ రెండు నివేదికల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం కాంక్షిస్తూ జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం విదితమే.