iDreamPost

ఆ 20 నియోజకవర్గాలపై CM కేసీఆర్ స్పెషల్ ఫోకస్!

ఆ 20 నియోజకవర్గాలపై CM కేసీఆర్ స్పెషల్ ఫోకస్!

తెలంగాణలో నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని అధికార పార్టీ బీఆర్ఎస్ గట్టి పట్టుమీదే ఉంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇక స్వయంగా సీఎం కేసీఆర్ 119 నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. రేపటి నుంచి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 8 వరకు కేసీఆర్ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఇదిలా ఉంటే..ఈ సారి బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు పావులు కదుపుతుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ ను ఆ 20 స్థానాలు ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించలేకపోవడం గమనార్హం. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మధిర, ఇల్లందు, సత్తుపల్లి, అశ్వరావుపేట, పినపాక లాంటి స్థానాల్లో బీఆర్ఎస్ తన ప్రాబల్యం చూపించుకోలేకపోయింది.

బీఆర్ఎస్ ఇప్పటి వరకు అసలు గెలుపొందని నియోజకవర్గాలు అయిన రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈసారి తమ పట్టు సాధించుకోవాలని చూస్తుంది. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటి ఆ సీట్లలో విజయం సాధించి చరిత్రం సృష్టించాలని చూస్తుంది.. అదే జరిగితే కొన్నేళ్ల వరకు బీఆర్ఎస్ కి పోటీ ఉండకుండా ఉంటుందని భావిస్తుంది. ఇదిలా ఉంటే.. భద్రాచలం, మధిర మినహా ఖమ్మంలో కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలు గతంలో బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ టికెట్ ఇచ్చినప్పటికీ వాటిని సున్నితంగా తీరస్కరించి బీఆర్ఎస్ కే జై కొట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ సీటు మాత్రమే బీఆర్ఎస్ గెల్చుకుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ అక్కడ ఎక్కువగా ఫోకస్ చేయడంతో తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చాటింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవాడానికి ఉవ్విళ్లూరుతుంది. అందుకే ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఇదిలా ఉంటే హైదరాబాద్ లో బీఆర్ఎస్ కొన్ని ప్రాంతాల్లో చాలా వీక్ గా ఉంది. ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాలతో పాటు గోషా మహాల్ లో బీఆర్ఎస్ ఎప్పుడూ గెలవలేదు. 2009 లో ముఖేష్ గౌడ్.. గోషా మహల్ కి ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత 2014,18 లో ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ వరుస విజయాలు సాధించారు. ఈసారి గోషామహల్ లో గెలుపు కైవసం చేసుకోవాలంటే.. సరైన క్యాండెట్ ని దింపాలనే ఉద్దేశంతో ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక రంగారెడ్డి జిల్లాలో కీలక నియోజకవర్గాలు అయిన ఎల్బీనగర్, మహేశ్వరం స్థానాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2014 లో మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డి టీడీపీ తరుపు నుంచి గెలిచారు.. ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తీగల, కాంగ్రెస్ అభ్యర్థినిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి కూడా బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం కాంగ్రెస్ కి గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారు. ఏది ఏమైనా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రాబల్యం చాటుకోవడానికి ఆ 20 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి