iDreamPost

Rashtrapatni remark row: రాష్ట్రపత్ని వ్యాఖ్యల వివాదం, సోనియా vs స్మృతి పోరుగా మారిందా?

Rashtrapatni remark row: రాష్ట్రపత్ని వ్యాఖ్యల వివాదం, సోనియా vs స్మృతి పోరుగా మారిందా?

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్మును కించపరిచార‌ని ఆరోపిస్తూ బీజేపీ ప్ర‌తిప‌క్ష పార్టీని చుట్టుముట్టింది. పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి శ్రీమతి ద్రౌప‌ది ముర్మును “రాష్ట్రపత్ని” అని పిలిచినందుకు క్షమాపణ చెప్పాలని బిజెపి ఈ రోజు సోనియా గాంధిని డిమాండ్ చేసింది.

లోక్ స‌భ‌లో బీజేపీ ఒక్క‌సారిగా కాంగ్రెస్ మీద విరుచుకుప‌డింది. కాంగ్రెస్ బ‌ల‌గాల‌న్నింటిని ఇరానీ సోనియ‌గాంధికి మ‌ళ్లించారు. అల‌లు అల‌లుగా విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతూనే ఉన్నాయి. ఈ దాడికి కాంగ్రెస్ నివ్వెర‌పోయింది. టార్గెట్ అంతా సోనియా గాంధీయే. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని శ్రీమతి ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర‌ప‌తిని అవ‌మానించ‌డాన్ని సోనియాగాంధి ఆమోదించార‌న్న‌ది ఇరానీ ప్ర‌ధాన విమ‌ర్శ‌. ఆదివాసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి , స్త్రీ వ్యతిరేకిగా సోనియాను విమ‌ర్శించారు.

కోవిడ్ నుండి కోలుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్ల‌మెంట్ ముందు మ‌రో నిర‌స‌న‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. ప్లకార్డులతో తోటి ఎంపీలతో కలిసి నిలున్నారు. అంత‌కుముందు దిగువ సభలో రాష్ట్ర‌ప‌త్ని వ్యాఖ్య‌ల‌ను, ఉద్దేశపూర్వక లైంగిక దాడిగా పిలిచారు. సోనియా గాంధీ దేశం ముందుకు వచ్చి రాష్ట్రపతిని అవమానించినందుకు, క్షమాపణ చెప్పాల‌ని ఆర్థిక మంత్రి లోక్‌సభలో గ‌ట్టిగా డిమాండ్ చేశారు.

మాట తూలితే బీజేపీ రాద్దాంతం చేస్తోంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు అంటున్నారు. జీఎస్‌టీ, అగ్నిపథ్‌ పథకం, నిరుద్యోగం, ధ‌ర‌ల పెరుగుద‌ల వంటి కీలక చర్చల నుంచి బీజేపీ దృష్టి మరల్చిందని ఆరోపించారు. సోనియా గాంధియే బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తుంటే, అధికార‌పార్టీకి క్షమాపణ చెప్పే అవకాశం లేదన్న అధీర్ రంజ‌న్ చౌద‌రి, తానే స్వయంగా శ్రీమతి ముర్ముని కలుస్తానని , రాష్ట్రపతికి “వందసార్లు” క్షమాపణలు చెబుతానని చెప్పారు. నేను బెంగాలీ. హిందీ నా మాతృభాష కాదు.అందుకే మాట జారింద‌న్న‌ది చౌద‌రి అంటున్నారు.

ఈ విష‌యాన్ని తేలిగ్గా వ‌దిలేలా లేదు బీజేపీ. అన్న‌ది పార్టీ నేత‌. కాని త‌న‌నెందుకు టార్గెట్ చేస్తున్నారో సోనియాగాంధికి మొద‌ట్లో అర్ధంకాలేదు. రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ముపై పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై, తనను ఎందుకు గొడవలోకి లాగుతున్నారని బీజేపీ నేత‌ల‌ను అడిగారు. “నా తప్పేంటి?” అని బీహార్ ఎంపీ రమాదేవిని సోనియా గాంధీ అడిగిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి