iDreamPost

రేపు విశాఖలో భారీ ర్యాలీ.. ఎందుకంటే..?

రేపు విశాఖలో భారీ ర్యాలీ.. ఎందుకంటే..?

కార్యానిర్వాహక రాజధానిగా నిర్ణయించిన విశాఖకు మద్ధతుగా రేపు శుక్రవారం సాగరతీరంలో భారీ ర్యాలీ జరగనుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించతలపెట్టారు. శుక్రవారం ఉదయం 6:30 గంటలకు విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఈ ర్యాలీ జరగనుంది. వివిధ ప్రజా, విద్యార్థి, స్వచ్ఛంద సంఘాలు ఈ ర్యాలీలో భాగస్వాములు అయ్యేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ర్యాలీలో పాల్గొనాలని ఆయా సంఘాలు విస్తృత ప్రచార సాగిస్తున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విశాఖతో సాధ్యమనే నినాదంతో ఈ ర్యాలీ జరగబోతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేశారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే, కొత్తగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించారు. ఆ మేరకు శాసన సభ ఆమోదం, గవర్నర్‌ ముద్రతో చట్టపరంగా మూడు రాజధానులు ఏర్పాటు పూర్తయింది. అయితే ఈ అంశంపై టీడీపీ సహా ఇతరులు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం వాటి విచారణ చివరి దశలో ఉంది. న్యాయస్థానాల్లో వివాదాలు పరిష్కారమై నూతన సంవత్సరం నాటికి మూడు రాజధానుల నుంచి పరిపాలన సాగే అవకాశం కనిపిస్తోంది.

మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకునేందుకు విశాఖపై టీడీపీ, దాని అనుకూల మీడియా దుష్ప్రచారం సాగించాయి. విశాఖలో భూ కంపాలు వస్తాయని, సిటి భవిష్యత్‌లో మునిగిపోతుందని, సాగరంలో చీలిక ఏర్పడిందని, దాని వల్ల సునామీ వస్తుందని.. ఇలా అనేక రకాలుగా విశాఖ ఖ్యాతిని తగ్గించేందుకు యత్నించాయి. విశాఖ ప్రజలను భయబ్రాంతులు చేసేందుకు చేసిన వారి ప్రచారం అంతా తేలిపోయింది. విశాఖపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంతో విసుగెత్తిన ఆ పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ తన కుమారులను వైసీపీలోకి పంపారు. ఆయన కూడా అధికార పార్టీకి మద్ధతు పలికారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని వల్ల ఎళ్లతరబడి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురైన తమ జీవితాలు మారుతాయనే ఆశ ఉత్తరాంధ్ర ప్రజల్లో నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి