iDreamPost

పాపులర్ సంస్థ చేతికి BCCI మీడియా హక్కులు.. భారత మ్యాచులు అందులోనే..!

  • Author singhj Published - 07:51 PM, Thu - 31 August 23
  • Author singhj Published - 07:51 PM, Thu - 31 August 23
పాపులర్ సంస్థ చేతికి BCCI మీడియా హక్కులు.. భారత మ్యాచులు అందులోనే..!

క్రికెట్​లో అత్యంత ధనిక బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందంజలో ఉంది. క్రికెట్​ అంటే వీరాభిమానం ఉన్న దేశం మనది. జెంటిల్మన్ గేమ్​ను ఓ మతంలా చూసేవాళ్లు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నారు. అదే బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తోంది. ఒకప్పుడు డబ్బుల్లేక ఎంతో సతమతమైన స్థితి నుంచి ఇవాళ వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు లెవల్​కు బీసీసీఐ చేరుకుంది. దీనికి భారత్​లో క్రికెట్​కు ఉన్న క్రేజ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి పొట్టి ఫార్మాట్​ లీగ్​ను తీసుకురావడం, క్రికెట్​లో టీమిండియా సత్తా చాటుతుండటం కారణాలుగా చెప్పొచ్చు. మన జట్టు ఆడే మ్యాచ్​లకు ఒక రేంజ్​లో హైప్ ఉంటుంది. భారత స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగి ఆడుతుంటే చూడాలని స్వదేశీ అభిమానులతో పాటు ఇతర దేశాల క్రికెట్ ఫ్యాన్స్​ కూడా ఎంతగానో ఎదురు చూస్తారు.

భారత జట్టు ఆడుతోందంటే టీవీలకు వచ్చే టీఆర్పీలు, ఓటీటీల్లో వచ్చే స్ట్రీమింగ్ కౌంట్ మామూలుగా ఉండదు. దీన్నే బీసీసీఐ క్యాష్ చేసుకుంటోంది. భారత క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయంలో సింహభాగం ప్రసార హక్కుల నుంచే వస్తోందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఇది మరోమారు నిరూపితమైంది. బీసీసీఐ మీడియా హక్కుల్ని వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన వయాకామ్ 18 సంస్థ దక్కించుకుంది. రాబోయే ఐదేళ్లలో (2023 సెప్టెంబర్ నుంచి 2028 మార్చి వరకు) భారత జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్​ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ ప్రసార హక్కుల్ని కూడా వయాకామ్ 18 సొంతం చేసుకుంది. అందుకు గానూ బీసీసీఐకి భారీగానే డబ్బుల్ని ముట్టజెప్పనుంది. భారత్ ఆడిన ప్రతి మ్యాచ్​కు రూ.67.8 కోట్లు చెల్లించనుంది.

ఇక మీదట టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్​లు స్పోర్ట్స్ 18 ఛానల్​లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇవే మ్యాచులు జియో సినిమా యాప్​లో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సినిమా ఇప్పటికే ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కుల్ని దక్కించుకున్న విషయం విదితమే. ఈ సంవత్సరం సెప్టెంబర్​ 22న స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మొదటి వన్డే నుంచి బీసీసీఐ కొత్త మీడియా పార్ట్​నర్ ప్రయాణం మొదలుకానుంది. కాగా, బీసీసీఐ మీడియా పార్ట్​నర్​గా ప్రస్తుతం స్టార్​ స్పోర్ట్స్​ సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. 2012 నుంచి స్వదేశంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మ్యాచులతో పాటు దేశవాళీ మ్యాచ్​లను కూడా ఈ సంస్థే లైవ్ టెలికాస్ట్ చేస్తూ వస్తోంది. బీసీసీఐ డిజిటల్ మీడియా పార్ట్​నర్​గా ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్​స్టార్ వ్యవహరిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి