iDreamPost

ఇక రిజర్వ్‌ డేలు ఉండవ్‌! వర్షం ఆగకుంటే.. భారత్‌-శ్రీలంక మధ్య ఫైనల్‌!

  • Author singhj Published - 03:34 PM, Tue - 12 September 23
  • Author singhj Published - 03:34 PM, Tue - 12 September 23
ఇక రిజర్వ్‌ డేలు ఉండవ్‌! వర్షం ఆగకుంటే.. భారత్‌-శ్రీలంక మధ్య ఫైనల్‌!

క్రికెట్​ మ్యాచ్​లకు వర్షం ఆటంకం కలిగించడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. వానల వల్ల మ్యాచ్​లు తుడిచిపెట్టుకుపోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే దైపాక్షిక టోర్నమెంట్లలో వానల వల్ల ఆటంకం కలిగినప్పుడు అంతగా ఇబ్బంది అనిపించదు. కానీ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లాంటి మెగా టోర్నీల్లో వర్షం అంతరాయం కలిగిస్తే ఆడే ప్లేయర్లతో పాటు మ్యాచ్​లు చూసే అభిమానులకు కూడా చిరాకు కలుగుతుంది. టోర్నమెంట్ చూస్తున్న ఫీల్ కూడా ఉండదు. అందుకే క్రికెట్​లో రిజర్వ్ డే కాన్సెప్ట్​ను తీసుకొచ్చారు.

ప్రధాన టోర్నీల్లో కీలక మ్యాచ్​లకు రిజర్వ్ డేను కేటాయిస్తారు. ఒకవేళ వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్​ ఆగిపోతే.. తర్వాతి రోజు తిరిగి అక్కడి నుంచే మ్యాచ్​ను కొనసాగిస్తారు. వరల్డ్ కప్, డబ్యూటీసీ ఫైనల్​తో పాటు ఐపీఎల్ లాంటి టోర్నీల్లోనూ రిజర్వ్ డేను కేటాయించడాన్ని చూస్తూనే ఉన్నాం. రిజర్వ్ డే నాడు ఆడిన మ్యాచుల్లో భారత జట్టు మిశ్రమ ఫలితాలు సాధించింది. 2019 వరల్డ్ కప్​ సెమీఫైనల్లో న్యూజిలాండ్​తో రిజర్వ్ డే నాడు ఆడిన మ్యాచ్​లో భారత్ ఓటమిపాలైంది. కీలక బ్యాటర్ ఎంఎస్ ధోని రనౌట్ కావడంతో టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి.

న్యూజిలాండ్​ జట్టుతోనే 2021లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రిజర్వ్ డే నాడు ఆడింది భారత్. ఆ మ్యాచ్​లోనూ మన జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే బ్యాడ్ సెంటిమెంట్​ను చెరిపేస్తూ ఆసియా కప్-2023 సూపర్-4 దశలో పాకిస్థాన్​తో ఆడిన మ్యాచ్​లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇదిలా ఉంటే.. ఆసియా కప్​లో ఇకపై జరిగే సూపర్-4 మ్యాచ్​లకు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మిగిలిన మ్యాచ్​లన్నీ రద్దయితే.. భారత్, శ్రీలంక జట్లు ఫైనల్స్​కు వెళ్తాయి. ఆసియా కప్ పాయింట్ల టేబుల్​లో ప్రస్తుతం టీమిండియా ఫస్ట్ ప్లేసులో ఉంది. సూపర్​-4లో ఆడిన ఒక మ్యాచ్​లో బంపర్ విక్టరీ కొట్టిన భారత్.. 2 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండో ప్లేసులో శ్రీలంక ఉంది.

బంగ్లాదేశ్​పై ఆడిన మ్యాచ్​లో గెలుపుతో 2 పాయింట్లు సాధించిన లంక.. పాయింట్ల పట్టికలో భారత్ తర్వాతి ప్లేసులో ఉంది. బంగ్లాదేశ్​పై గెలిచిన పాక్, భారత్ పై ఓడటంతో టేబుల్​లో మూడో ప్లేసులో నిలిచింది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన బంగ్లా టేబుల్​లో లాస్ట్ ప్లేసులో ఉంది. ఆ టీమ్ ఫైనల్​కు వెళ్లే ద్వారాలు మూసుకుపోయాయి. తదుపరి మ్యాచ్​లకు రిజర్వ్ డే లేనందున వర్షం వల్ల మ్యాచ్​లు రద్దయితే పాక్​ నష్టపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్​పై ఓటమితో ఆ జట్టు రన్​రేట్ పడిపోయింది. దీంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న భారత్, శ్రీలంకలు నేరుగా ఫైనల్స్​కు అర్హత సాధిస్తాయి. అయితే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్​కు రిజర్వ్ డే ఉంటుందో లేదో ఇంకా స్పష్టత రాలేదు.

ఇదీ చదవండి: ఓటమి బాధలో ఉన్న పాక్​కు మరో షాక్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి