iDreamPost

కొత్త సంవత్సరం ప్రారంభమే ముహూర్తం

కొత్త సంవత్సరం ప్రారంభమే ముహూర్తం

ఇప్పటికే అనేక సంక్షేమ పధకాలు అమలు చేసిన ఆంద్రప్రదేశ్ సర్కార్ నూతన సంవత్సరంలో మరిన్ని పధకాలకు శ్రీకారం చుట్టబోతోంది. కొత్త ఏడాది లో జనవరి ప్రారంభం నుంచే ఈ పని చేయబోతోంది. జనవరి 1 నుంచి కొత్త వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డుల జారీని ప్రారంభించనుంది. 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ,ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా జనవరి 3 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అదే రోజు నుంచి మిగిలిన 12 జిల్లాల్లో 1,200 రోగాలకు ఆరోగ్యశ్రీని అమలు చేస్తారు. ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌ రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించనున్నారు.

వివిధ దీర్ఘాహ కాలిక రోగాలతో బాధపడుతున్న వారికి జనవరి నుంచి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, హీమోఫిలియా, డయాలసిస్‌ రోగులకు రూ.10 వేల చొప్పున పెన్షన్లు ఇవ్వనున్నారు. బోదకాలు, తీవ్ర అనారోగ్యంతో వీల్‌ చైర్లకు పరిమితమైన వారు, తీవ్ర పక్షవాతంతో బాధపడుతున్నవారికి పెన్షన్లు 5 వేలు చొప్పున ఇవ్వనున్నారు. కుష్టు టవ్యాధితో బాధపడుతున్న వారికి నెలకు రూ.3 వేల చొప్పున జనవరి నుంచి పింఛన్ మంజూరు చేయనున్నారు.

ఇప్పటికే రాష్ట్రము వెలుపల ఆరోగ్య శ్రీ లో వైద్య సేవలు అందిస్తున్నారు. నవంబర్‌ 1 నుంచి హైదరాబాద్‌లో 72, బెంగళూరులో 35, చెన్నైలోని 23 ఆస్పత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద సూపర్‌స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. డిసెంబర్‌ 2 నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స చేయించుకున్నవారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నారు. రోజుకు 225 రూపాయలు, లేదా నెలకు 5 వేల చొప్పున వైద్యులు సూచిన సమయం మేరకు ఇస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి