iDreamPost

నెల్లూరుకు ఎన్నికలు..! అడ్డంకులు అధిగమించడంపై అడుగులు

నెల్లూరుకు ఎన్నికలు..! అడ్డంకులు అధిగమించడంపై అడుగులు

ఓ పని విజయవంతంగా జరిగినా, జరగకపోయినా దానికి కారణం అధికారులే. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల మున్సిపల్‌ పోరులో నెల్లూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగలేదు. నగరంలోని డివిజన్ల మధ్య సరిహద్దులు, ఓటర్ల జాబితా శాస్తీయంగా లేకపోవడం ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా మారింది. డివిజన్ల మధ్య ఓటర్ల జాబితాలో భారీ వ్యత్యాసం ఉన్నా.. సరిదిద్దడంలో నెల్లూరు నగరపాలక సంస్థ యంత్రాంగం విఫలమైంది. ఫలితంగా కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితా సరిదిద్దాకే ఎన్నికలు జరపాలనే పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన కోర్టు.. ఎస్‌ఈసీ తరఫున వాదనలు కూడా విన్నది. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం లేదని ఎస్‌ఈసీ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అంటే.. ఓటర్ల జాబితా శాస్త్రీయంగా తయారు చేసిన తర్వాతే నెల్లూరు నగరపాలికకు ఎన్నికలు జరుగుతాయని స్పష్టమవుతోంది. విచారణను కోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలు, పర్యవేక్షణలో ఓటర్ల జాబితా సరిదిద్దే పని అధికారులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో 16 కార్పొరేషన్లు ఉంటే.. అందులో 12 కార్పొరేషన్లకు మాత్రమే ఇటీవల ఎన్నికలు జరిగాయి. కాకినాడ కార్పొరేషన్‌ పాలక మండలి గడువు ఉండడంతో మరో రెండేళ్ల తర్వాతనే అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. శ్రీకాకుళం, రాజమహేంద్రవరంలలో విలీన గ్రామాల వివాదం నెలకొని ఉంది. ఇక నెల్లూరు సంగతి తెలిసినదే. 54 డివిజన్లు ఉన్న నెల్లూరులో ఓటర్ల జాబితాలోని తప్పులును సరిదిద్దిన వెంటనే పోరు షురూ కానుంది.

1884లో మున్సిపాలిటీగా ఏర్పడిన నెల్లూరు 2004లో కార్పొరేషన్‌గా మారింది. 54 డివిజన్లు ఉన్న కార్పొరేషన్‌కు ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే పాలక మండళ్లు ఏర్పడ్డాయి. అందులో ఒకసారి కాంగ్రెస్, మరోసారి వైసీపీ నెల్లూరు నగరాన్ని పాలించాయి.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా నెల్లూరు నగరపాలక సంస్థను అధికార వైసీపీ గెలుచుకోవడం లాంఛనమే. వైసీపీకి మంచి పట్టు ఉన్న జిల్లాల్లో కడప తర్వాత స్థానం నెల్లూరుదే. గడచిన కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీనే మేయర్‌ పీఠాన్ని గెలుచుకుంది. 2014 సాధారణ ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానంతోపాటు 10 అసెంబ్లీ సీట్లకు గాను ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. 2019లో ఎంపీ సీటుతోపాటు పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది.

వైసీపీ బలంగా ఉండగా, టీడీపీకి నాయకత్వమే కొరవడింది. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో మంత్రిగా పని చేసిన పి.నారాయణ 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అమరావతి భూ కుంభకోణంపై ఆరోపణలు వచ్చినప్పుడు వచ్చి వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఏడాదిన్నరగా నారాయణ ఎవరికీ కనిపించ లేదు. టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న నారాయణ పూర్తిగా సైలెంట్‌ కావడంతో.. టీడీపీని ఎవరు నడిపిస్తారనే ప్రశ్న మెదులుతోంది.

ప్రస్తుతం నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడు కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అబ్ధుల్‌ అజీజ్‌ మాత్రమే ఆ పార్టీలో పెద్ద తలకాయలుగా కనిపిస్తున్నారు. అజీజ్‌ 2014లో వైసీపీ కార్పొరేటర్‌గా గెలిచి మేయర్‌ అయ్యారు. తర్వాత కొద్ది నెలలకే టీడీపీలోకి ఫిరాయించారు. కార్పొరేషన్‌ ఎన్నికలు అజీజ్‌ రాజకీయ భవిష్యత్‌కు ఓ పరీక్ష లాంటివి. కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చాటితేనే అజీజ్‌కు టీడీపీలో భవిష్యత్‌ ఉంటుంది. అధికార పార్టీ గెలుపు భారం మొత్తం మంత్రి అనిల్‌ తన భుజష్కంధాలపై వేసుకుంటారనడంలో సదేహం లేదు.

Also Read : గాల్లో ఏలూరు కార్పొరేషన్‌ ఫలితం.. విచారణ మళ్లీ వాయిదా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి