iDreamPost

మరో 44 మందికి హైకోర్టు నోటీసులు

మరో 44 మందికి హైకోర్టు నోటీసులు

కోర్టు ధిక్కారం కింద ఇప్పటికే 49 మందికి నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు తాజాగా మరో 44 మందికి తాకీదులు ఇచ్చింది. మొదటి జాబితాలో ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తోపాటు పలువురు నెటిజన్లు ఉండగా.. తాజా జాబితాలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తో సహా 44 మందికి నోటీసులు ఇచ్చింది.

మత్తు డాక్టర్‌ సుధాకర్‌ కేసును సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశించడంపై పలువురు సోషల్‌ మీడియా వేదికలుగా వ్యాఖ్యానాలు, పోస్టులు, వీడియోలు పెట్టారు. ఈ నేపథ్యంలో తమ తీర్పులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోర్టు సుమోటోగా ఈ విషయాన్ని పరిగణించి విచారణ చేపట్టింది. మొదటగా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన 49 మందిపై చర్యలకు ఆదేశించగా.. తాజాగా ట్విట్టర్‌లో వ్యాఖ్యానాలు, వీడియోలు పోస్టు చేసిన వారిపై దృష్టి సారించినట్లు హైకోర్టు విడుదల చేసిన జాబితాను బట్టి తెలుస్తోంది.

మొదటి జాబితాలో నోటీజులు అందుకున్న వారిలో కొంతమందిపై ఇప్పటికే ఏపీ పోలీసులు విచారణ చేసి కేసులు నమోదు చేయగా.. మిగతా వారిపై కూడా విచారణ చేస్తున్నారు. తాజాగా నోటీసులు జారీ చేసిన వారితో కలుపుకుంటే మొత్తం తాకీదులందుకున్న వారి సంఖ్య 93కు చేరుకుంది. హైకోర్టు తీరు చూస్తుంటే.. ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి