Idream media
Idream media
అభివృద్ధి అంటే నాలుగు బిల్డింగులు కట్టడం కాదు. నిన్న కన్నా నేడు బాగుండడం.. రేపు మరింత బాగుంటుందన్న భరోసా ప్రజల్లో కల్పించడం.
మహిళలు ముందడుగు వేయాలి. సుస్తి చేస్తే డబ్బుల్లేక వైద్యం దొరకదనే భయం ప్రజల్లో ఉండకూడదు. అన్నదాతకు అన్ని విధాలుగా అండగా ఉండాలి. చదువే సమాజాన్ని నడిపిస్తుంది.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఇతర వర్గాలకు సైతం తగిన విధంగా చేయూతనివ్వాలి. జనసాధికారిత సాధించాలి.
… ఇవీ గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు. ప్రజల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అని నమ్మిన సీఎం వైఎస్ జగన్.. తన ఆలోచనలను ఆచరణలో పెడుతూ ఏపీ ప్రజల తలరాతలను మారుస్తున్నాని ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణల ద్వారా తేటతెల్లమైంది. మునుపటికి భిన్నంగా అంకెల గారడీని రూపుమాపుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారు.
ప్రజల ఆంక్షల మేరకు పని చేసేదే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. ఆ మాటను సీఎం వైఎస్ జగన్ నిజం చేస్తున్నారు. తాజాగా మరో మూడు కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెనుకబడిన కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, 13 ఫెడరేషన్లు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఆయా కులాల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని భావించిన సీఎం వైఎస్ జగన్.. 2019 నవంబర్లో 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి. వాటికి పాలక మండళ్లను కూడా నియమించారు. ఎస్సీలకు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
Also Read : పుదుచ్చేరిలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలో ఊగిసలాట : రంజుగా కూటమి రాజకీయం
అంతేకాకుండా అగ్రవర్ణాల్లోను ఉన్న పేదలకు అండగా ఉండేందుకు.. కార్పొరేషన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వైశ్య, బ్రహ్మణ, కాపు కార్పొరేషన్లు ఉండగా.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈబీసీ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. తాజాగా మిగిలిన అగ్రవర్ణాలైన రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాల సంక్షేమ, అభివృద్ధికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు కార్పొరేషన్లకు త్వరలో పాలక మండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక చైర్మన్/చైర్పర్సన్తో సహా గరిష్టంగా 12 మంది డైరెక్టర్లు ఒక్కొక్క కార్పొరేషన్కు నియమించనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలోని 45–60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి 18,750 రూపాయల చొప్పన నాలుగేళ్లలో 75 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని వైఎస్ జగన్ ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేశారు. అయితే ఆయా కులాలతోపాటు అగ్రవర్ణాలలోనూ పేదలు ఉన్నారని, వారిని అదుకోవాలనే ఆకాంక్ష ప్రజల్లో నెలకొంది.
ప్రజల మనస్సుల్లో ఉన్న ఆలోచన తనకు చేరిన వెంటనే సీఎం వైఎస్ జగన్ ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. అగ్రవర్ణాలలోని 45–60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు కూడా ఆర్థిక సాయం చేసేందుకు ఈబీసీ నేస్తం పేరుతో ఏడాదికి 15 వేల రూపాయల చొప్పన రాబోయే మూడేళ్లపాటు 45 వేల రూపాయల ఆర్థిక సాయం చేసేలా పథకం ప్రకటించారు. ఈ ఏడాది ఈ పథకం అమలు కాబోతోంది. ఈ దిశగానే అగ్రవర్ణ పేదల అభ్యున్నతికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడం.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారనేందుకు నిదర్శనం.
Also Read : రఘురామరాజుకు బెయిల్.. కానీ మాట్లాడొద్దని షరతు