iDreamPost

చేవెళ్లలో “దిశ” తరహా ఘటన

చేవెళ్లలో “దిశ” తరహా ఘటన

దిశా ఘటనను మరవకముందే రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి శివారులో ఒక యువతిని బండరాయితో తలపై మోది హత్య చేసారు గుర్తు తెలియని దుండగులు. తంగడవల్లి శివారులో వంతెన కింద మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బండరాయితో తలపై మోదిన ఆనవాళ్లు ఉండటం, యువతి శరీరంపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేయబడిన యువతి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేవెళ్ల డిఎస్పీ రవీందర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.అక్కడకు యువతిని ఎవరు తీసుకొచ్చారు,అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించి పోలీసులు పలు టీములుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలంలో యువతికి సంబంధించిన ఆధారాలు లభించకపోవడంతో చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

గతంలో ఇదేవిధంగా హైదరాబాద్ శివారులో చటాన్ పల్లి శివారులో దిశపై హత్యాచారం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కాగా సీన్ రీ కంస్ట్రక్షన్ చేస్తున్న సమయంలో దిశ నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేసినందుకు పోలీసులు దిశ నిందితులను ఎన్కౌంటర్ చేశారు. అదే తరహాలో మరోసారి చేవెళ్ల లో మరోమహిళపై హత్యాచారం జరగడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి