iDreamPost

ముందే వస్తున్న ‘పుష్ప’ రాజ్

ముందే వస్తున్న ‘పుష్ప’ రాజ్

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. గతంలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి ఉండడంతో ఈ కాంబినేషన్ మీద ముందు నుంచే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఈ కాంబినేషన్ ప్రకటించిన నాటి నుంచి అంచనాలు అంతకంతకూ పెరుగుతూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కెరీర్లో మొట్టమొదటిసారిగా ఒక డీ గ్లామర్ రోల్ లో నటిస్తూ ఉండగా ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తుండగా సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ముందు రెండు భాగాలుగా రిలీజ్ చేద్దామని అనుకోలేదు కానీ ఈ సినిమా నిడివి పెరగడంతో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ముందు నుంచి అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా మొదటి భాగం ఆగస్టు నెలలో విడుదల కావాల్సి ఉంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా సినిమాను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించారు. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించారు కానీ తేదీ మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే 24వ తేదీన సినిమా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగినా సినిమా మరో వారం ముందు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే పుష్ప సినిమా ఒక్క తెలుగులోనే కాక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. అల్లు అర్జున్ కి తెలుగుతో పాటు మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. తమిళ్ లో కూడా కొంచెం పర్లేదు కానీ కన్నడ హిందీ భాషల్లో మాత్రం మార్కెట్ మెరుగు పరుచుకోవాల్సి ఉంది.

అయితే సరిగ్గా క్రిస్మస్ రోజునే హిందీలో ఎన్నో అంచనాలతో 83 సినిమా రిలీజ్ అవుతోంది. 1983లో వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో కపిల్ దేవ్ జర్నీ ని బేస్ చేసుకుని రణవీర్ సింగ్, దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ కబీర్ సింగ్ 83 సినిమాను రూపొందించారు. అయితే ఆ సినిమా విడుదల అవుతుంటే ఒక పక్క స్పోర్ట్స్ బయోపిక్ ఆడడంతో పాటు బాలీవుడ్ స్టార్ క్యాస్టింగ్ ఉండడంతో బాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఆ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సో అప్పుడు రిలీజ్ చేయడం కంటే ఒక వారం ముందే రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్న నిర్మాతలు డిసెంబర్ 17న విడుదల చేయాలని యోచిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా దసరా నేపథ్యంలో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో పాటు ముత్తంశెట్టి మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పుష్ప సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది అనే అంశం మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read : సాయి తేజ్ సినిమాకున్న సవాళ్లేంటి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి