iDreamPost

Agneepath Scheme Protest బీజేపీకి అగ్నిప‌థ్ షాక్, మోదీ ఏం చేయ‌బోతున్నారు?

Agneepath Scheme Protest బీజేపీకి అగ్నిప‌థ్ షాక్, మోదీ ఏం చేయ‌బోతున్నారు?

అగ్నిప‌థ్ స్కీమ్ యావ‌త్త భార‌త‌దేశానికే చిచ్చుపెట్టింది. నాలుగేళ్ల అగ్నివీర్ ల‌ను ప్ర‌క‌టించ‌డానే ఆర్మీ మాజీ అధికారులు మండిప‌డ్డారు. ఉద్యోగాల్లేని కుర్రాళ్ల కోసం, సైన్యం నిబద్ధ‌త‌ను దెబ్బ‌తీస్తున్నార‌న్న వాద‌న మొద‌టి రోజే గ‌ట్టిగా వినిపించింది. అదీ ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో.

మాజీ సైనికాధారుల్లో అగ్నిప‌థ్ అసంతృప్తిని రాజేయ‌డానికి కార‌ణం, మోదీ ప్ర‌భుత్వం ఉద్యోగాల‌నివ్వ‌డానికి, ఆర్మీని ఎంచుకొంద‌ని భావించ‌డం.

నిర‌స‌న‌ల‌కు దిగిన కుర్రాళ్లు మాత్రం దీనికి వ్య‌తిరేకంగా ఆలోచిస్తున్నారు. అగ్నిప‌థ్ వ‌ల్ల ఉన్న‌ ఉద్యోగాలు పోతాయి. కొత్తవి రావ‌ని భావిస్తున్నారు. నిరుద్యోగుల్లో ఎక్కువ‌మంది యువ‌తే. ఉద్యోగ క‌ల్ప‌న‌ల‌న్న‌ది ఎంత‌టి ప్ర‌భావ‌వంత‌మైన‌ రాజ‌కీయ అస్త్ర‌మో వాళ్ల‌కు బాగా తెలుసు. అందుకే రాజ‌కీయంగా చైత‌న్యంగా ఉండి, మ‌తాల‌వారీగా భారీగా చీలిపోయిన రాష్ట్రాల్లోనే నిర‌స‌న‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఆశ‌లు త‌క్కువున్న‌ జాబ్ మార్కెట్ గురించి వాళ్ల‌కు బాగానే తెలుసు. ద‌క్షిణాదిక‌న్నా ఉత్త‌రాదిలోనే ప్ర‌భుత్వాల కోసం పోరాటం ఎక్కువ‌. రైల్వేలుకానీయండి, కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను వాళ్లు ఎక్కువ‌గా కోరుకొంటారు. వీటిమీద ఆశ‌లు లేన‌ప్పుడే, ప్రైవేట్ ఉద్యోగాల‌ను వెతుక్కొంటారు. ప్ర‌భుత్వాలు ఏమైనా, వాళ్ల విధానాలు ఏమైనా, వాళ్ల‌కు కావాల్సింది ప‌ర్మినెంట్ ప్ర‌భుత్వ ఉద్యోగం. మంచి జీతం. అందుకే ఆర్మీకూడా వాళ్ల‌కు మంచి ఉద్యోగ అవ‌కాశం.

నిర‌స‌నలు, సికింద్రాబాద్ లో రైళ్లు త‌గ‌ల‌బెట్ట‌డంతోనే యువ‌త‌మీద వ‌యిలెంట్ అన్న‌ ముద్ర‌వేయాలా? ఇప్పుడు సివిల్స్ కు డిమాండ్ పెరుగుతోంది. సంవ‌త్స‌రాల పాటు ఢిల్లీ, హైద‌రాబాద్, ముంబైలాంటి చోట ఉంటూ, యేడాది ల‌క్ష‌లు ఖ‌ర్చుచేస్తూ సివిల్స్ ప్రిపేర‌య్యేటంత ఆర్ధిక స్థోమ‌త వీళ్ల‌కు ఉండ‌దు. ఇంటిద‌గ్గ‌రో, కొన్నివేలు క‌ట్టి ,చిన్న అకాడ‌మిల్లోనూ వీళ్లు ప్రిపేర్ అవుతుంటారు. చాలామందికి ఆర్మీలో అవ‌కాశం రావ‌డ‌మంటే ఆకాశంలో చంద‌మాట నేల‌మీద‌కు దిగిన‌ట్లే.

టెన్త్, ఇంట‌ర్ చదివినివాళ్ల‌కు ఆర్మీ రిక్రూట్మెంట్ అంటే వాళ్ల‌కు సివిల్స్ కిందే లెక్క‌. సైన్యానికి కావాల్సిన శారీర‌క ధారుడ్యం క‌ష్ట‌ప‌డి తెచ్చుకున్న‌వాళ్ల‌కు అగ్నిప‌థ్, ఆశ‌ల‌ను చిదిమేంసింది.

అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని, సివిల్స్ ప్రిపేర్ అవుతున్న‌వాళ్ల‌కు అనువ‌ర్తించి చూద్దాం. 2020,2021 అంతా కోవిడ్ తోనే పోయింది. అయినా సివిల్స్ కు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు స‌డ‌న్ గా ఒక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. అందులో నాలుగేళ్ల సివిల్స్. అందులో 25శాతం మందినే ప‌ర్మినెంట్ చేస్తాం. మిగిలిన వాళ్లు ఇంటికెళ్లి, వాళ్ల‌కు త‌గిన ఉద్యోగాల‌ను వెతుక్కోవాల‌ని చెబితే ఎలాగుంటుంది? గ‌గ్గోలు పుట్టదూ? ఇప్పుడు అగ్నిప‌థ్ విష‌యంలో జ‌రుగుతోంది అదే. కాక‌పోతే వీళ్లంతా పేద‌లు, దిగువ మ‌ధ్య‌స్థాయికి చెందిన వాళ్లు. అందుకే మిడిల్ క్లాస్, ఉన్న‌త వ‌ర్గాలు వాళ్ల‌మీద‌ వ‌యిలెంట్ యూత్ గా ముద్ర‌వేస్తున్నారు. వాళ్లు దేశ‌భ‌క్తులుకాద‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. ఇది అవ‌గాహ‌న రాహిత్య‌మే.

అగ్నిపథ్‌ .. కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం

అగ్నిపథ్‌ స్కీమ్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలతో కేంద్రానికి కొత్త‌స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. చాలా రాష్ట్రాల్లో నిరసనకారులు రైళ్లను తగలబెట్టారు. హింస‌కు పాల్ప‌డుతున్నారు.ఈ త‌రుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అ‍గ్నివీర్స్ కు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. Central Armed Police Forces, అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. తొలియేడాదికి వ‌యోప‌రిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్ల‌కు ఇంత‌కుముందే పెంచారు. అయినా నిర‌స‌న జ్వాల‌లు ఆగ‌డంలేదు.

మ‌రి ప్ర‌భుత్వం ఏమంటోంది? ల‌క్ష‌ల్లో ఉద్యోగాల‌ను క‌ల్పించ‌డం ఏ ప్ర‌భుత్వానికి సాధ్యంకాదు. ముఖ్యం ఆర్మీలో. మోడ‌ర్న ఆర్మీ అంటే నెంబ‌ర్ కాదు, స‌మ‌ర్ధ‌త‌. సైన్యం సంఖ్య త‌గ్గాలి. వాళ్ల‌కు వ‌చ్చే ఆయుధాల స్థాయి పెర‌గాలి. వాళ్ల‌కు అధునాత‌న‌ సౌక‌ర్యాలుండాలి. వ‌చ్చేదంతా ఆర్టిఫిష‌య‌ల్ ఇంటిలిజెన్స్ కాలం. అంటే ఒక‌రే ప‌ది ప‌నులు చేయ‌గ‌ల‌రు. అదే స‌మ‌యంలో యువ‌త ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌ను గుర్తించుకోవాలి. భ‌విష్య‌త్తు అవ‌స‌రాలు, నేటి ఆకాంక్ష‌ల మధ్య తూకం స‌రిగా ఉంటేనేక‌దా దేశం ముందుకెళ్లేది?
రైతాంగ పోరాటం పంజాబ్, దాని చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల్లోనే కేంద్రీకృత‌మైంది. ఇక్క‌డ మోడీ ప్ర‌భావం చాలా త‌క్కువ‌. అందుకే రైతులు నిర‌స‌న‌కు దిగార‌ని స‌ర్ధిచెప్పుకోవ‌చ్చు. కాని ఇప్పుడు రేగుతున్న నిర‌స‌ల‌న్నీ బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ‌. ఇక్క‌డ బీజేపీ-మోడీ హవా న‌డిచింది. అంటే వీళ్ల‌లో ఎక్కువ‌మంది బీజేపీకే ఓటువేసివుంటారుక‌దా!

ఇప్పుడు బీజేపీ అర్ధంచేసుకోవాల్సింది… ఏదైనా కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకొంటున్న‌ప్పుడు ఆయా వ‌ర్గాల‌తో మాట్లాడాలి. లాభ‌న‌ష్టాల‌ను అంచ‌నావేసుకోవాలి. ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌జెప్పాలి. అంతేకాని కొద్దిమందికి న‌చ్చింద‌ని, జ‌నం మీద రుద్ద‌కూడ‌ద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి