iDreamPost

ఆరోజు లైలా చేసిన పనికి చనిపోయేవాళ్లం.. అందుకే ఆమెను కొట్టాను: జేడీ చక్రవర్తి

  • Published Aug 08, 2023 | 2:28 PMUpdated Aug 08, 2023 | 2:28 PM
  • Published Aug 08, 2023 | 2:28 PMUpdated Aug 08, 2023 | 2:28 PM
ఆరోజు లైలా చేసిన పనికి చనిపోయేవాళ్లం.. అందుకే ఆమెను కొట్టాను: జేడీ చక్రవర్తి

జేడీ చక్రవర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గులాబి, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా చిత్రాల ద్వారా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇక జేడీ చ​క్రవర్తి తన కెరీర్‌లో కేవలం హీరోగా మాత్రమే కాక విలన్‌గా, సహాయ నటుడిగా పలు చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కూడా తన సత్తా చాటుతున్నారు. జేడీ చక్రవర్తి తాజాగా ‘దయ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్‌తోనే జేడీ చక్రవర్తి ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టారు.

ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. జేడీ చక్రవర్తి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. దయ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనిలో భాగంగా జేడీ చక్రవర్తి ఒకప్పటి హీరోయిన్‌ లైలా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

జేడీ చక్రవర్తి, లైలా, శ్రీకాంత్‌ జంటగా ఎగిరే పావురమా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో లైలా చేసిన ఒక పని వవల్ల తామంతా చనిపోయేవాళ్లమని గుర్తు చేసుకున్నారు జేడీ చక్రవర్తి. అదే సయమంలో తాను లైలా మీద చేయి చేసుకున్నానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘నేను నటించిన హీరోయిన్స్‌ అందరిలో లైలా చాలా ధైర్యవంతురాలు. తనతో నేను ఎగిరే పావరమా సినిమాలో నటించాను. అయితే ఈ సినిమాలో భాగంగా రైలు సన్నివేశాలు షూట్‌ చేస్తున్నాం’’ అని తెలిపారు.

‘‘నేను రైల్వే ట్రాక్ పక్కన అలా నిలబడి ఉంటాను. లైలా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తుంది. ఈ సీన్‌ కోసం మేం.. రైలు ఎక్కడో 100 ఫీట్ల దూరంలో ఉండగానే ఈ షాట్ షూట్‌ చేసి మేమిద్దరం పక్కకు వచ్చేయాలి అనుకున్నాం. నేను షాట్ చేసేసి పక్కకు తప్పుకున్నాను. నా తర్వాత లైలా పక్కకు రాబోయింది. అయితే ఆ సీన్‌లో ఆమె లంగా ఓణి ధరించి ఉండటంతో.. అవి కాస్త ట్రాక్‌లో ఇరుకుపోయాయి’’ అని గుర్తు చేసుకున్నారు.

లైలాను కొట్టాను..

‘‘అటు చూస్తేనేమో ట్రైన్ వచ్చేస్తుంది. అప్పటికే షాక్‌తో బిగుసుకుపోయి.. లైలా కదలడం లేదు. వాస్తవంగా చెప్పాలంటా లైలా చాలా సరదా మనిషి. ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటుంది. పైగా మామీద ప్రాంక్‌లు చేస్తూ ఉంటుంది. అలాంటి అమ్మాయి.. ఆసమయంలో ఎంతో భయపడింది. రైలు మరో 50 అడుగుల దూరంలో ఉంది. కానీ తాను షాక్‌లో బిగుసుకుపోయింది. నార్మ్‌లాగా ఇలాంటి పరిస్థితిలో.. ట్రాక్లో ఇరుక్కున్న లంగా ఓణిని చింపుకొని వస్తే సరిపోయేది. కానీ లైలా అసలు అక్కడ నుంచి కదలడం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి లైలాను పట్టుకొని పక్కకు లాగాను’’ అని చెప్పుకొచ్చారు.

‘‘ఆ తర్వాత ఓ 20 నిమిషాలు లైలాతో పాటు నేను కూడా భయపడిపోయాను. తను ఇంకా షాక్‌లోనే ఉంది. తనను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి.. నేను తన చెంప మీద కొట్టాల్సి వచ్చింది. కొట్టిన తర్వాత కూడా లైలా అదే షాక్‌లో ఉండిపోయింది. రైలు తనకు అంద దగ్గర నుంచి వెళ్లే సరికి భయపడింది. నేను కూడా అప్పుడు లైలా కంటే ఎక్కువగా భయపడిపోయా” అని చెప్పుకొచ్చారు జేడీ చక్రవర్తి. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక దయ వెబ్‌ సిరీస్‌లో జేడీ చక్రవర్తితో పాటు ఈషా రెబ్బా, విష్ణు ప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి