iDreamPost

తిరుప‌తి బై పోల్ : గుద్దుకున్నారా..? గుద్దారా..? ఇప్ప‌టికీ మార‌ని తీరు..!

తిరుప‌తి బై పోల్ : గుద్దుకున్నారా..? గుద్దారా..? ఇప్ప‌టికీ మార‌ని తీరు..!

తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఊహించిన‌ట్లుగానే వ‌స్తున్నాయి. ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో వైసీపీకి తిరుగులేద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి. ఈ విష‌యం విప‌క్షాల‌కు కూడా ముందే తెలుసు. అందుకే గెలుపు కోసం కాకుండా ద్వితీయ స్థానం కోసం, గ‌తంలో వ‌చ్చిన ఓట్ల కంటే కాస్త‌యినా ఎక్కువ ఓట్లు సంపాదించ‌డం కోసం క‌ష్ట‌ప‌డ్డాయి.

ఫ‌లితం ద‌క్కుతుందా, లేదా అనేది ప‌క్క‌న బెడితే.. అనుకున్న‌ది సాధించ‌లేక పోయినా అందుకు ఇదీ కార‌ణం అని చెప్పేందుకు పోలింగ్ రోజు నుంచే ప‌న్నాగం పొందారు. దీనిలో భాగంగానే దొంగ‌, దొంగ అంటూ దొంగ ఓట్ల రాజ‌కీయాల‌ను తెర‌పైకి తెచ్చారు. విచిత్రం ఏంటంటే ఈ అంశంపై విప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌చ్చాయి. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి ఏంట‌నేది ఫ‌లితాలు తేట‌తెల్లం చేస్తున్నాయి. వాళ్లు దుష్ఫ్ర‌చారం చేసిన దొంగ ఓట్ల‌కు మించే వైసీపీ ఆధిక్య‌త‌లో కొన‌సాగుతోంది. వాస్త‌వాల‌ను వెల్ల‌డించ‌కుండా ఇప్ప‌టికీ అనుకూల మీడియా వింత ప్ర‌చారం చేస్తోంది.

తిరుప‌తిలో వైసీపీ అభ్యర్థి ముద్దిళ్ల గురుమూర్తి భారీ ఆధిక‌త్యం దిశ‌గా వెళ్తున్నారు. క‌డ‌ప‌టి వార్త‌లు అందేస‌రికి గురుమూర్తి 1, 56, 199 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. గురుమూర్తికి 3,58,292 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 2,02,093 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 35,254 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌కు 5,828 ఓట్లు పోలయ్యాయి. 11, 02,068 ఓట్లు పోల‌వ్వ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు 6 ల‌క్ష‌ల ఓట్ల లెక్కింపు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. సుమారు 2 ల‌క్ష‌ల ఆధిక్యం దిశ‌గా వైసీపీ దూసుకెళ్తోంది. ఎలాగూ వైసీపీకి భారీ ఆధిక్య‌త త‌ప్ప‌ద‌ని ముందే గుర్తించిన విప‌క్షాలు దొంగ ఓట్ల నాట‌కాన్ని ర‌క్తి క‌ట్టించాయి.

Also Read : తిరుపతిలో బీజేపీకి డిపాజిట్ గల్లంతేనా?

పోలింగ్‌లో దొంగ ఓట్లు వేశారంటూ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి లిఖితపూర్వకంగా అలిపిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. న్యా య స్థానాన్ని కూడా ఆశ్ర‌యించారు. టీడీపీ గెలుస్తుందన్న భయంతోనే వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. అనంత‌రం బీజేపీ కూడా అదే పాట పాడింది. తిరుపతి ఉప ఎన్నికను రద్దుచేసి తిరిగి నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అభ్య‌ర్థి ర‌త్న ప్ర‌భ కూడా కోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ భారీగా దొంగ ఓట్లు వేయించిందని ఆయన ఆరోపించారు.

విచిత్రం ఏంటంటే ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌స్తున్న వైసీపీ మెజార్టీని చూస్తూ కూడా అదే పాట పాడుతున్నారు. టీడీపీ అనుకూల మీడియా అదే ప్ర‌చారం చేస్తోంది. మా ఇష్టం అని తిరుప‌తిలో దొంగ ఓట్లు గుద్దుకున్నారు.. గెలుస్తున్నారు అంటూ డిబేట్లు పెడుతున్నాయి. ఇప్ప‌టికే 2 ల‌క్ష‌ల మెజార్టీ ఆధిక్యంలో వైసీపీ ఉంది కాబ‌ట్టి నిజంగా వారి ఆరోప‌ణ‌లే నిజ‌మ‌నుకుంటే దాదాపు ప్ర‌తీ చోటా 50 వేల‌కు పైగానే దొంగ ఓట్లు ప‌డ్డాయ‌నుకోవాలా..?

అలాగే, దొంగ ఓట్లు ప‌డితే పోలింగ్ శాతం పెర‌గాలి. కానీ ఈసారి పార్ల‌మెంట్ ప‌రిధిలో మొత్తం 64.44 శాతం పోలింగ్ న‌మోదైంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంట్‌లో అది 79.03% గా న‌మోదైంది. గ‌తంతో పోలిస్తే, తాజా ఎన్నిక‌ల్లో 14.59% త‌క్కువ పోలింగ్ న‌మోదైంది. ఇవి కూడా అధికారిక లెక్క‌లే. ఆటు మెజార్టీ, ఇటు పోలింగ్ శాతం ఏది ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నా దొంగ ఓట్ల ప్ర‌చారం ఆబ‌ద్ధ‌మ‌ని నిజ‌మ‌వుతోంది. ఎన్నిక‌లు అన్నాక ఎక్క‌డో చోట త‌ప్పుడు ఓట్లు న‌మోదు కావ‌డం మామూలే. కానీ, ప‌డ్డావ‌న్నీ దొంగ ఓట్లే అని టీడీపీ ప్ర‌చారం చేసింది. అనుకూల మీడియా ఇప్ప‌టికీ దాన్నే వంత‌పాడుతుండ‌డం విడ్డూరం. 

Also Read : తిరుప‌తి బై పోల్ : టీడీపీ ఆశ‌లు గ‌ల్లంతే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి