iDreamPost

8 వారాల ఓటిటి – జరిగే పనేనా?

8 వారాల ఓటిటి – జరిగే పనేనా?

ఆ మధ్య టాలీవుడ్ నిర్మాతలు స్ట్రైక్ చేసి మరీ తీసుకున్న నిర్ణయాల్లో థియేటర్ కు ఓటిటికి మధ్య కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనేది అనుకోవడమే కాదు తీర్మానించుకున్నారు కూడా. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాలకూ ఇది వర్తిస్తుందని చెప్పారు. సరే జరిగితే మంచిదే కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం దానికేమాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. సెప్టెంబర్ చివరి వారంలో వచ్చిన శ్రీవిష్ణు అల్లూరి నిన్న రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. పట్టుమని మూడు వారాలు దాటకుండా సురేష్ సంస్థ లాంటి పెద్ద బ్యానర్ భాగస్వామ్యం ఉన్న శాకినీ డాకిని, దొంగలున్నారు జాగ్రత్త నెట్ ఫ్లిక్స్ లో వచ్చి ఆల్రెడీ సందడి చేస్తున్నాయి.

సుధీర్ బాబు కృతి శెట్టిల ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలిని ఉన్నట్టుండి చెప్పాపెట్టకుండా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఆరు నెలల తర్వాతే డిజిటల్ ఉంటుందని బీరాలు పోయిన అమీర్ ఖాన్ నాగ చైతన్యల లాల్ సింగ్ చడ్డా యాభై రోజులు పూర్తి కావడం ఆలస్యం ఛలోమని ఓటిటి బాట పట్టేసింది. అక్షయ్ కుమార్ రక్షాబంధన్ ది కూడా ఇదే రూటు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ డిజాస్టర్లు కాబట్టి తొందరగా వస్తే తప్పేంటనే లాజిక్ లో న్యాయముంది. ఎందుకంటే ఆలస్యం చేస్తే జనంలో వీటి మీదున్న కనీస ఆసక్తి కూడా చచ్చుబడిపోతుంది. అది వచ్చే వ్యూస్ కి గండి పెడుతుంది. సో ఇలా చేయడం కరెక్టే

ఈ సినిమాలు గతంలో అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం ఎర్లీ ప్రీమియర్ అయ్యాయని చెప్పుకున్నా భవిష్యత్తులోనూ ఇలాంటి ఫ్లాపులు వస్తూనే ఉంటాయి. వాటిని రెండు నెలల పాటు ఆపి ఉంచితే నిర్మాతకు ఓటిటి సంస్థలు ఇచ్చే రేట్ తగ్గిపోతుంది. పైగా ఫలితం తెలిసిపోయి ఉంటుంది కాబట్టి మరీ లేట్ అయితే ఆ ఏం చూస్తాంలే అని జనం లైట్ తీసుకునే ప్రమాదం ఉంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, విక్రమ్, గాడ్ ఫాదర్ లాంటి హిట్లకు అయితే ఓకే కానీ డిజాస్టర్లకు ఎనిమిది వారాల విండోని తీసేయడమే బెటర్. నిర్మాతల మండలి దీని మీద పునరాలోచన చేస్తుందా లేక ఎవరైనా మీరైనా కూడా గతంలోలా చూసి చూడనట్టు వదిలేస్తుందా లెట్ వెయిట్ అండ్ సీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి