iDreamPost

రౌడీ హీరో మళ్ళీ రిస్క్ చేస్తాడా..?

రౌడీ హీరో మళ్ళీ రిస్క్ చేస్తాడా..?

ప్యాన్ ఇండియా ఉచ్చు చాలా ప్రమాదకరం. సరిగా హ్యాండిల్ చేశామా మార్కెట్ ఎక్కడికో వెళ్తుంది. లేదూ దాని ట్రాప్ లో పడ్డామా అంతే వేగంగా కిందకు తొక్కేస్తుంది. అందుకే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు తమ కెరీర్ పీక్స్ ఉన్న టైంలో హిందీ హిట్లు కొట్టినప్పటికీ నార్త్ ఆడియన్స్ ని మెప్పించే ఒత్తిడిలో తెలుగు సినిమాల మీద ఫోకస్ పోతుందని గుర్తించి ఒకటి రెండు ఫ్లాపులు రాగానే బాలీవుడ్ కి పూర్తిగా దూరమయ్యారు. కానీ ప్రభాస్ కేసు వేరు. బాహుబలి దెబ్బకు జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. దీన్ని ఎవరితోనూ పోల్చలేం. అదృష్టమో దురదృష్టమో ఇది తనకు మేలుతో పాటు కీడూ చేసింది. అందుకే సాహో, రాధే శ్యామ్ లు దెబ్బ తిన్నాయి.

ఇక విషయానికి వస్తే రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ తో తీవ్రంగా దెబ్బ తిన్నాక బయట కనిపించడం తగ్గించేశాడు. కొన్ని ఈవెంట్లు హాజరైనా మునుపటి దూకుడు లేదు. సౌమ్యత పెరిగింది. లైగర్ ప్రమోషన్లలో అతిశయోక్తిగా మాట్లాడ్డం తనకెంత చేటు చేసిందో సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న విజయ్ దేవరకొండ దృష్టి మొత్తం ఇప్పుడు ఖుషి మీదే ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ లో సమంతా హీరోయిన్. తన కోసమే షూట్ కి బ్రేక్ ఇచ్చారు. లేదంటే డిసెంబర్ 23 విడుదలకు రూట్ క్లియరయ్యేది. లైగర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ పూరితోనే ప్లాన్ చేసుకున్న జనగణమన పూర్తిగా రద్దయిన సంగతి తెలిసిందే

ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తో విజయ్ ఒక మూవీ చేయొచ్చనే ప్రచారం ముంబై మీడియాలో జోరుగా సాగుతోంది. డియర్ కామ్రేడ్ రిలీజ్ కు ముందే ఈ వార్త చక్కర్లు కొట్టింది. కానీ దాని ఫలితం దారుణంగా రావడంతో అక్కడితో ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. కట్ చేస్తే లైగర్ లోనూ కరణ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. కాకపోతే నేరుగా పెట్టుబడి పెట్టకుండా డిస్ట్రిబ్యూషన్ లో సహాయం చేసినందుకు పేరు ఇచ్చారనే మాట కూడా వచ్చింది. ఏదైతేనేం విజయ్ దేవరకొండ ఇకపై నార్త్ మార్కెట్ ని కాకుండా పూర్తిగా తెలుగులోనే ఫోకస్ పెడితే అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్స్ మన దర్శకులతోనే సాధించవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి