iDreamPost

ప్రధానితో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

ప్రధానితో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

ప్రధాని నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానితో గంటకు పైగా సీఎం భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఆయా అంశాలకు సంబంధించి ప్రధాని మోడీకి సీఎం వైఎస్ జగన్ వినతిపత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, జాతీయ ఆహారభద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలను ప్రధానమంత్రికి సీఎం వైఎస్ జగన్ వివరించారు.

ప్రధానికి విజ్ఞప్తి చేసిన అంశాలు..

– పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా రూ. 55,548.87 కోట్లను ఆమోదం.

– జాతీయ ఆహారభద్రత కింద ఏపీలో 1.45 కోట్ల రేషన్‌ కార్డులకు గాను కేవలం 89 లక్షల కార్డులకే రేషన్‌ అందుతోంది. మిగతా కార్డుదారులకు కూడా రేషన్‌ అందించాలి.

– బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన సైట్‌ క్లియరెన్స్‌ అనుమతుల గడువు ముగిసింది. ఆయా అనుమతులు వెంటనే ఇవ్వాలి.

– కడప స్టీల్‌ ప్లాంట్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.

– ఏపీ మినరల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బీచ్‌సాండ్‌ మినరల్స్‌ ప్రాంతాలను కేటాయించాలి.

– 12 బోధనాస్పత్రులకు అనుమతులు మంజూరు చేయాలి.

– రెవెన్యూ లోటు రూ. 32,625 కోట్ల రూపాయలు విడుదల చేయాలి.

– కోవిడ్‌ వల్ల 33,478 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయాం. గత ప్రభుత్వం అదనంగా చేసిన రుణాలకు ఇప్పుడు కోత విధించవద్దు.

– తెలంగాణ నుంచి ఏపీ డిస్కంలకు రావాల్సిన రూ. 6,455.76 కోట్ల రూపాయలను ఇప్పించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి