iDreamPost

జైలు నుంచి వచ్చి.. ప్రేమించలేదని.. ఇంటర్ బాలికని కత్తితో పొడిచి..

జైలు నుంచి వచ్చి.. ప్రేమించలేదని.. ఇంటర్ బాలికని కత్తితో పొడిచి..

తనని ప్రేమించలేదని ఓ యువకుడు ఇంటర్ బాలికని కత్తితో పొడిచి పారిపోయాడు. తమిళనాడులోని తిరుచ్చిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ చదివే ఓ బాలిక పరీక్షలు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా అప్పటికే ఆమె కోసం కాచుకొని ఉన్న కేశవన్‌ అనే యువకుడు బాలిక రావడంతోనే ఆమెపై కత్తితో దాడి చేసి 14 సార్లు పొడిచాడు. ఇదే యువకుడు గతేడాది బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో పాటు బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడంతో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేశవన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిరోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చిన కేశవన్ ఆ బాలికపై కోపం పెంచుకున్నాడు. దీంతో మళ్ళీ ప్రేమించమని వెంటపడటం మొదలు పెట్టాడు. బెదిరింపులకు కూడా గురిచేశాడు. బాలిక ప్రేమకు నిరాకరించడంతో పాటు ఇలా చేస్తే మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది.

దీంతో ఆ బాలిక తన ప్రేమని ఒప్పుకోలేదని ఆ బాలిక కోసం కాపు కాసి మరీ కత్తితో దాడి చేశాడు. 14సార్లు కత్తితో పొడవడంతో ఆ బాలిక అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. రక్తపు ముడుగుల్లో ఉన్న బాలికను చూసిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాలికకు చికిత్స అందజేస్తున్నారు. బాలిక పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాలికపై దాడిచేసిన కేశవన్‌ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఈ ఘటనపై ఆ కాంగ్రెస్‌ ఎంపీ జోతిమణి ట్వీట్‌ చేస్తూ.. ఓ పాఠశాల విద్యార్థిని 14 సార్లు కత్తిపోట్లకు గురైందని విని షాక్‌కు గురయ్యాను. కేశవన్‌ను అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసే విధంగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తో మాట్లాడాను అని తెలిపారు. ఇలాంటి దురాగతాలు జరిగిన ప్రతిసారీ మేము కలత చెందుతున్నామని, కఠిన శిక్షలు విధించి సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి