iDreamPost

బాబాయ్ లా ఆలోచిస్తే ఒప్పుకోడేమో

బాబాయ్ లా ఆలోచిస్తే ఒప్పుకోడేమో

గత రెండు రోజులుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాలో దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని తీసుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు ఫిలిం నగర్ లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. యూనిట్ ఏదీ చెప్పే సిచువేషన్ లో లేదు కాబట్టి ప్రస్తుతానికి దీన్ని గాసిప్ గానే తీసుకోవాలి. అయితే ఈ విషయంలో తారక్ ఆలోచన ఎలా ఉందన్న కోణాన్ని ఇక్కడ కొంత విశ్లేషించాలి.

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే గతంలో శ్రీదేవి సరసన నందమూరి బాలకృష్ణ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ కాంబినేషన్ కోసం ఎందరో దర్శక నిర్మాతలు ట్రై చేసినా ఒప్పుకోలేదు. కారణం నాన్న స్వర్గీయ ఎన్టీఆర్ తో ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో ఆడిపాడిన శ్రీదేవి సరసన నటించడం బాలయ్యకు ఇష్టం లేకపోవడమే. అందుకే ఈ కాంబోలో సినిమా సాధ్యం కాలేదు. శ్రీదేవికి అభ్యంతరం లేకపోయినా బాలయ్యే ఒప్పుకోలేదని అప్పట్లో చెప్పుకునేవారు. సరే ఇప్పుడు అసలు పాయింట్ కు వద్దాం.

జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలు. తాతయ్యతో డ్యూయెట్లలో ఆడిపాడి రొమాన్స్ చేసిన హీరోయిన్ కూతురితో మనవడు జట్టు కట్టేందుకు ఒప్పుకుంటాడా లేక ఆలోచిస్తాడా అనే అనుమానం అభిమానుల్లో తలెత్తుతోంది. ఇదంతా పక్కనబెడితే అసలు జాన్వీ కపూర్ డేట్లు అంత ఈజీగా దొరకడం లేదు. విజయ్ దేవరకొండ సినిమా కోసం పూరి జగన్నాథ్ జాన్వీను తీసుకోవాలని చాలా ట్రై చేశాడట. కానీ వర్కవుట్ కాలేదు. అందులోనూ బోనీ కపూర్ ఇప్పుడిప్పుడే జాన్వీని సౌత్ కి పరిచయం చేసే ఉద్దేశంలో లేడట.

మరి ఇప్పుడీ అంచనాలన్నీ కేవలం ప్రచారానికే పరిమితమవుతాయా లేక అంతకు మించి అడుగులు పడతాయా అనేది వేచి చూడాలి. త్రివిక్రమ్-తారక్ కాంబో సినిమా ఆర్ఆర్ఆర్ పనులు పూర్తయ్యాక మొదలవుతుంది. 2021 సమ్మర్ విడుదల అని ప్రకటించారు కాని కరోనా ప్రభావం వల్ల అన్ని వాయిదా పడ్డాయి కాబట్టి క్లారిటీ రావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి