iDreamPost

కీర్తి సురేష్ సినిమా ఏమైంది ?

కీర్తి సురేష్ సినిమా ఏమైంది ?

మహానటితో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాలను దోచేసిన కీర్తి సురేష్ ప్రస్తుతం సర్కారు వారి పాటలో మహేష్ బాబు సరసన జోడి కట్టిన సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే చిరంజీవి భోళా శంకర్ లో చెల్లిగా నటించేందుకు ఒప్పుకోవడం అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. దాని తాలూకు వీడియో అందులో చిరు కీర్తిల మధ్య బాండింగ్ ని ఎస్టాబ్లిష్ చేసిన తీరు జనాన్ని బాగా ఆకట్టుకుంది. ఈ ఏడాది నితిన్ తో కలిసి నటించిన రంగ్ దే మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది కాస్తా నిరాశ పరచడం ఫ్యాన్స్ కి సైతం బాధ కలిగించింది. ఇక అసలు విషయానికి వద్దాం.

ఎప్పుడో ఫస్ట్ లాక్ డౌన్ టైంకే షూటింగ్ పూర్తి చేసుకున్న గుడ్ లక్ సఖి ఇప్పటిదాకా విడుదలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇందులో కీర్తి సురేష్ దే లీడ్ రోల్. ఆది పినిశెట్టి మరో కీలక పాత్ర పోషించాడు. జగపతిబాబు లాంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా గట్టిగా ఉన్నారు. ఇంత చేసినా ఎందుకు మార్కెటింగ్ ఎందుకు చేయడం లేదన్న అనుమానం అందరిలోనూ మెదులుతోంది. ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసిన నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించినా కూడా ఎందుకు ఇది వెనుకబడి ఉందో అంతు చిక్కడం లేదు. మరో ట్విస్ట్ ఏంటంటే దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కనీసం లిరికల్ వీడియోలు కూడా వదల్లేదు.

పోనీ ఓటిటి రిలీజ్ చేస్తారా అనుకుంటే ఆ సూచనలు కనిపించడం లేదు. గత ఏడాది కీర్తి సురేష్ రెండు సినిమాలు పెంగ్విన్, మిస్ ఇండియా డైరెక్ట్ డిజిటిల్ లో విడుదలయ్యాయి. కానీ చాలా దారుణంగా బోల్తా కొట్టాయి. దెబ్బకు తనకు సోలోగా భారీ ధర ఇచ్చేందుకు ఓటిటి సంస్థలు వెనుకాడాయా లేక నిజంగా కంటెంట్ బాగుండి నిర్మాతలు థియేటర్ల కోసం ఎదురు చూస్తున్నారో తెలియదు. ఒకవైపు ఇంకా అయిదు నెలల టైం ఉన్న సినిమాలే రిలీజ్ డేట్లు ప్రకటిస్తూ ఉంటే గుడ్ లక్ సఖి మాత్రం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదు. చిరు మహేష్ ల సినిమాలు కాకుండా కీర్తి సురేష్ ఒప్పుకున్న స్ట్రెయిట్ మూవీస్ ఇంకేవి లేవు

Also Read :  క్రేజీ ఆఫర్లతో అనసూయ బిజీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి