iDreamPost

డిఎంకెకు ప్రశాంత్‌ కిషోర్‌…అన్నాడిఎంకెకు సునీల్ః వ్యూహ‌క‌ర్త‌ల‌ను న‌మ్ముకున్న త‌మిళ పార్టీలు

డిఎంకెకు ప్రశాంత్‌ కిషోర్‌…అన్నాడిఎంకెకు సునీల్ః వ్యూహ‌క‌ర్త‌ల‌ను న‌మ్ముకున్న త‌మిళ పార్టీలు

దేశంలో ఎన్నిక‌లు జ‌రిగితే వ్యూహ‌క‌ర్త‌ల హవా కొన‌సాగుతుంది. ప్ర‌ధాన పార్టీల‌న్నీ వీరినే న‌మ్ముకుంటాయి. వీరి అడుగుజాడ‌ల్లోనే. క‌నుస‌న్నల్లోనే ఆయా పార్టీలు ఎన్నిక‌ల ర‌ణ‌క్షేత్రంలోకి వెళ్తాయి. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ల వ్యూహ‌లు ప‌లించిన సంద‌ర్భాలే ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల వ్యూహ‌క‌ర్త‌ల వ్య‌వ‌హ‌రం మ‌నేది 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంత‌కు ముందు ఉన్న‌ప్ప‌టికీ ఈ స్థాయిలో చ‌ర్చ‌కు రాలేదు. అప్పుడు స‌లహాదారుడు అనేవారు. ఇప్పుడు వ్యూహ‌క‌ర్త అంటున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ అప్పుడు బిజెపి ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఉన్నారు. ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిషోర్‌ను ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్నారు. ఆ ఎన్నిక‌ల్లో బిజెపి ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ప్ర‌శాంత్ కిషోర్ దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం అయ్యాడు.

ఆ త‌రువాత ప్ర‌శాంత్ కిషోర్‌ బీహార్‌లోని అధికార జెడియు అధినేత‌, ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌కు ఎన్నిక‌ల్లో వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించాడు. అందుకు ప్ర‌తిఫలంగా ఆయ‌న పార్టీలోకి ప్ర‌శాంత్‌ను ఆహ్వానించిద‌విని క‌ట్ట‌బెట్టారు. ఆ త‌రువాత ఆయ‌న అనేక రాష్ట్రాల్లో వివిధ పార్టీల‌కు వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు వ్య‌వ‌హ‌రించి, అక్క‌డ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్‌లోని మ‌మ‌తా బెనార్జీ నేతృత్వంలోని తృణ‌ముల్ కాంగ్రెస్‌కు, త‌మిళ‌నాడులోని స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకెకి ఎన్నిక‌ల వ్యూహక‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే త‌మిళ‌నాడులో వచ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అధికార అన్నాడిఎంకె కూడా సునీల్ అనే వ్య‌క్తిని వ్య‌వ‌హ‌క‌ర్త‌ను నియ‌మించుకుంటుంది.

కరోనా వైరస్‌ భయంతో ప్రజలంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దాదాపుగా మరిచిపోయారు. అయితే త‌మిళ పార్టీలు అన్నాడిఎంకె, డిఎంకె పార్టీలు మాత్రం ప్రణాళికలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ను డిఎంకె నియమించుకున్న నేపథ్యంలో అధికార అన్నాడిఎంకె సైతం డిఎంకె మాజీ రాజకీయ వ్యూహకర్త సునీల్‌తో జతకట్టనుంది. కరోనాకు కళ్లెం వేయగానే ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు ఇరు పార్టీలూ సిద్ధం అవుతున్నాయి. రాజకీయ పార్టీల్లో కార్యకర్తలపై విశ్వాసం పెట్టుకునే రోజులు అంతరించిపోగా ఐటీ రంగ నిపుణుల సలహాలు, సూచనలతో ఎన్నికల బరిలోకి దిగేలా మార్పులు చోటుచేసుకున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో డిఎంకెకు సునీల్‌ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. సునీల్‌ మార్గదర్శకంలోనే డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు ఆ పార్టీ కూడా నడిచింది.

సునీల్‌ సలహా మేరకే స్టాలిన్ ‘నమక్కు నామే’ పేరున పాదయాత్ర సాగిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోకపోయినా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా డిఎంకె అవతరించింది. అదే బాణిని అనుసరించి లోక్‌సభ ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. అయితే 21 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సునీల్‌ వ్యూహం డిఎంకెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఉప ఎన్నికల్లో అత్యధిక సీట్లను కొల్లగొట్టడం ద్వారా అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని కూలదోసి డిఎంకె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశలు అడియాసలయ్యాయి. దీంతో సునీల్, డిఎంకె బంధానికి బీటలువారాయి. డిఎంకెకు సునీల్‌ దూరం అయ్యారు. డిఎంకె సైతం వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ను నియమించుకుంది. డిఎంకెకు ఘనవిజయం సాధించిపెట్టడం ద్వారా స్టాలిన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో ప్రశాంత్‌ కిషోర్‌ ఇప్పటికే రంగంలోకి దిగినట్లు‌ సమాచారం.

ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకెను ఢీకొట్టేందుకు అన్నాడిఎంకె సైతం అడుగులు వేయడం ప్రారంభించింది. ప్రశాంత్‌ కిషోర్‌కు పోటీగా డిఎంకె నుంచి వైదొలగిన సునీల్‌ను రాజకీయ వ్యూహకర్తగా అన్నాడిఎంకె నియమించుకుంది. సునీల్‌ సూచనల మేరకే అన్నాడిఎంకె ఐటీ విభాగాన్ని ప్రక్షాళన చేసినట్లు సమాచారం. గత ఐటీ విభాగం వారు ఎలాంటి వ్యూహకర్తలు లేకుండానే 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత విజయం సాధించేందుకు సహకరించారు. జయ హయాంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఐటీ విభాగం సహకారంతో అన్నాడిఎంకెను మరోసారి అధికారంలో కూర్చొనబెట్టేందుకు సునీల్‌ రంగ ప్రవేశం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడగానే అన్నాడిఎంకె, డిఎంకెలు తమ వ్యూహాలతో ప్రజాక్షేత్రంలో వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి