iDreamPost

విజయనగరం రైలు ప్రమాద ఘటనపై కేంద్రానికి సీఎం జగన్‌ మూడు ప్రశ్నలు

  • Published Oct 31, 2023 | 11:06 AMUpdated Oct 31, 2023 | 11:06 AM

విజయనగరం రైలు ప్రమాదం ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌.. దీనిపై కేంద్రానికి మూడు ప్రశ్నలు సంధించారు. ఆ వివరాలు..

విజయనగరం రైలు ప్రమాదం ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌.. దీనిపై కేంద్రానికి మూడు ప్రశ్నలు సంధించారు. ఆ వివరాలు..

  • Published Oct 31, 2023 | 11:06 AMUpdated Oct 31, 2023 | 11:06 AM
విజయనగరం రైలు ప్రమాద ఘటనపై కేంద్రానికి సీఎం జగన్‌ మూడు ప్రశ్నలు

విజయనగరం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో సుమారు 14 మంది మృతి చెందగా.. 50 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందుతోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. అత్యవసర సహాయం అందించడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులను ఆదేశించారు. ఇక సోమవారం నాడు స్వయంగా వెళ్లి బాధితులన పరామర్శించారు సీఎం జగన్‌. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

అంతేకాక ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, గాయపడ్డవారికి 2 లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు సీఎం జగన్‌. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందంటూ.. ట్విట్టర్‌ వేదికగా కేంద్రానికి మూడు ప్రశ్నలు సంధించారు సీఎం జగన్‌. ఆ వివరాలు..

ప్రమాదం గురించి తెలియజేసిన సీఎం జగన్‌.. దీనిపై కేంద్రానికి మూడు ప్రశ్నలు సంధించారు.

‘‘1. బ్రేకింగ్ సిస్టమ్, అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు?
2. సిగ్నలింగ్ ఎందుకు విఫలమైంది?
3. కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైంది?’’

అనే ప్రశ్నలను లేవనెత్తిన సీఎం జగన్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ.. భవిష్యత్తులో ఇలాంటి భయనక ప్రమాదాలు మళ్లీ చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక ప్రస్తుతం ప్రమాదం జరిగిన మార్గంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా అన్ని మార్గాల్లో.. తాను లేవనెత్తిన ప్రశ్నలతో పాటు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు సీఎం జగన్‌.

ఇక ఈ ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పియి దుఖఃసాగరంలో మునిగిన వారికి.. ఆ బాధ తట్టుకునే ధైర్యం అందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు జగన్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్యం అందించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి