iDreamPost

Venkatesh :విక్టరీ వద్దనుకున్న ఆడవాళ్లు వీళ్లేనా

Venkatesh :విక్టరీ వద్దనుకున్న ఆడవాళ్లు వీళ్లేనా

నిన్న విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లుకు ఆశించిన స్థాయిలో స్పందన దక్కడం లేదు. టైటిల్ ఆకర్షణీయంగా ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ ని మొదటి రోజు బాగానే రప్పించినప్పటికీ డ్రామా కంటెంట్ మరీ ఎక్కువ కావడంతో ప్రేక్షకులు నిటూరుస్తూ బయటికి వస్తున్నారు. ఎలాగూ తమకు కావాల్సినవి ఇందులో ఉండవని మాస్ దూరంగా ఉండగా రావాల్సిన క్లాసుకు సైతం టాక్ అడ్డుపడుతోంది. ఫస్ట్ డే శర్వానంద్ కనీసం 2 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయాడని ట్రేడ్ టాక్. 1 కోటి 90 లక్షల దగ్గరే ఆగిపోయినట్టు తెలిసింది. థియేట్రికల్ బిజినెస్ సుమారు 16 కోట్ల దాకా జరగడంతో ఇప్పుడు కనీసం బ్రేక్ ఈవెన్ చేరుకోవడమే పెద్ద టార్గెట్ గా మారిపోయింది.

దీనికి వెంకటేష్ కి కనెక్షన్ ఏంటనే సందేహం రావొచ్చు. నిజానికి ఈ టైటిల్ ని దర్శకుడు తిరుమల కిషోర్ వెంకీ కోసం ప్లాన్ చేసుకున్నారు. ఆ మేరకు కొన్నేళ్ల కిందట అధికారిక ప్రకటన వచ్చింది కూడా. తీరా చూస్తే బయటికి చెప్పని కారణాలతో ఆపేశారు. పేరు ఇదే కాబట్టి కథ కూడా మారకపోయి ఉండొచ్చు. మరి వెంకీ రిజెక్ట్ చేయడానికి కారణం బహుశా వయసు దృష్టా తనకది అంతగా సెట్ కాదని భావించి ఉంటారు. పైగా మల్లేశ్వరిలో చేసిన పెళ్లి కాని ప్రసాద్ క్యారెక్టర్ కే ఇది కొంచెం ఎక్స్ టెన్షన్ లా ఉంటుంది కాబట్టి ఎందుకొచ్చింది లెమ్మని వదులుకుని ఉంటారు. ఇప్పుడీ ఫలితం చూస్తుంటే ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది.

వెంకటేష్ ఇలా డ్రాప్ కావడం ఇదొక్కటే కాదు. ఆ మధ్య తేజ డైరెక్షన్ లో ఆటా నాదే వేటా నాదే అని షూటింగ్ మొదలుపెట్టారు. కానీ అది ముందుకెళ్ళకుండానే ఆగిపోయింది. తర్వాత తేజ సీత తీసి డిజాస్టర్ అందుకున్నారు. కొన్ని నెలల క్రితం తరుణ్ భాస్కర్ చెప్పిన లైన్ కి ఓకే చెప్పారు. కానీ అదీ కార్యరూపం దాల్చలేదు. దాంతో అతను సురేష్ బ్యానర్ లోనే వేరే ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. సో వెంకటేష్ డెసిషన్లు సరైనవే అని తోస్తున్నాయి. ఇక ఆడవాళ్లు మీకు జోహార్లుకు ఈ రోజు రేపు చాలా కీలకంగా మారనుంది. ఈ వీకెండ్ ని పూర్తిగా క్యాష్ చేసుకుని కలెక్షన్లు పెంచుకుందా ఓకే లేదంటే 11న రాధే శ్యామ్ వచ్చాక రాబట్టుకోవడం కష్టమే.

Also Read : RRR Overseas : ఓవర్సీస్ లో ట్రిపులార్ సందడి షురూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి