iDreamPost

అన్నకు వచ్చిన చిక్కే తమ్ముడికీ

అన్నకు వచ్చిన చిక్కే తమ్ముడికీ

అదేంటో కొన్ని కాకతాళీయంగా జరిగినా చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అందులోనూ పరిశ్రమలో ఇలాంటి విచిత్రాలకు కొదవే లేదు. ఇప్పుడు మెగా మేనళ్ళులైన తేజ్ బ్రదర్స్ కు అలాంటి చిక్కే వచ్చి పడింది. సాయి ధరమ్ తేజ్ తెరంగేట్రం 2014లో పిల్లా నువ్వు లేని జీవితంతో జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2015లో రేయ్ రిలీజయింది. వాస్తవానికి ముందు రావాల్సింది రేయ్ నే. 2010లో షూటింగ్ ప్రారంభమైనా రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఆఖరికి ఐదేళ్లు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఫ్ కోర్స్ ఫలితం ప్రతికూలంగానే వచ్చింది లెండి.

ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ వంతు వచ్చింది. తనను పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిస్తున్న ఉప్పెన ఏప్రిల్ 2న విడుదల కావాలి. కానీ కరోనా వల్ల వాయిదా పడింది. మేలో థియేటర్లకు పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి జూన్ లేదా జులైలో వచ్చే అవకాశం ఉంది. ఎంత లేదన్నా రెండు మూడు నెలల గ్యాప్ అయితే తప్పదు. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ తదితర ఫార్మాలిటీస్ ఉన్నాయి. అప్పుడు చెప్పిన సమయానికి అన్నయ్య మొదటి సినిమా రాలేదు ఇప్పుడు తమ్ముడి మూవీ కూడా చిన్నపాటి బ్రేక్ పడింది.

కాకపోతే వైష్ణవ్ తేజ్ కు ఊరట కలిగించే అంశం ఏమిటంటే ఉప్పెన షూటింగ్ అయిపోయింది. ఒకవేళ షూటింగ్ మధ్యలో ఉండి కరోనా లాంటి అడ్డంకి వచ్చి ఉంటే చాలా ఇబ్బంది కలిగేది. ఇప్పుడా సమస్య లేదు. సాయి తేజ్ కు జరిగినంత ఆలస్యం వైష్ణవ్ తేజ్ జరగకపోవడం ఊరట కలిగించే అంశం. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించిన ఉప్పెనకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికే హిట్ అయ్యింది. ఇంకో రెండు ట్రాక్స్ విడుదల చేయాల్సి ఉంది. అయితే ఉప్పెనకు కొత్త డేట్ తో పాటు విపరీతమైన పోటీ తప్పేలా లేదు. నాని వి, ఒరేయ్ బుజ్జిగా, అరణ్య, నిశబ్దంతో పాటు క్యులో చాలానే ఉన్నాయి. మరి ఈ ధాటిని తట్టుకుని ఉప్పెన ఎలా ఫేస్ చేయనుందో వేచి చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి