iDreamPost

రాజ్‌భవన్‌ ఎదుటే దారుణం.. చీరలు అడుపెట్టి నడి రోడ్డుపై

  • Published Aug 14, 2023 | 1:36 PMUpdated Aug 14, 2023 | 1:36 PM
  • Published Aug 14, 2023 | 1:36 PMUpdated Aug 14, 2023 | 1:36 PM
రాజ్‌భవన్‌ ఎదుటే దారుణం.. చీరలు అడుపెట్టి నడి రోడ్డుపై

ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా సరే.. మన దేశంలో మాత్రం అభివృద్ధి అనుకున్నంత వేగంగా మాత్రం సాగడం లేదు. అంతరిక్షంలోకి ప్రయాణం చేస్తోన్న ఈ రాకెట్‌ యుగంలో కూడా.. అవ్యవసర అంబులెన్స్‌ సదుపాయం లేక ఏటా ఎందరో ప్రాణాలు విడుస్తున్నారు.. గర్భవతులైతే.. నడి రోడ్డు మీదే బిడ్డకు జన్మనిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. సమయానికి అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో.. నడి రోడ్డుపై.. అది కూడా గవర్నర్‌ అధికారిక నివాసం రాజ్‌భవన్‌ ఎదురుగానే ప్రసవించింది ఓ మహిళ. ఆమె పరిస్థితి చూసి చలించిన చుట్టుపక్కల జనాలు.. చీరలు అడ్డు పెట్టి.. ఆమెకు సాయంగా నిలిచారు. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో దారుణం చోటుచేసుకుంది. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేక.. ఓ మహిళ నడిరోడ్డుపైనే ప్రసవించింది. ఈ సంఘటన యూపీ గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌ ఎదురుగానే జరగడం గమనార్హం. రూపా సోని అనే మహిళ ప్రస్తుతం నాలుగున్నర నెలల గర్భవతి. ఇంకా నెలలు నిండలేదు. కానీ ఈలోపే ఆమెకు నొప్పులు వచ్చాయి. దాంతో లక్నోలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ సివిల్‌ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు రూపా సోనిని పరీక్షించి.. ఓ ఇంజక్షన్‌ చేసి పంపించారు.

దాంతో నొప్పులు కాస్త తగ్గినట్లు అనిపించడంతో.. రూపా సోని రిక్షాలో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యింది. కొద్ది దూరం వెళ్లాక ఆమెకు మరోసారి నొప్పులు మొదలయ్యాయి. ఆమె పరిస్థితి గమనించి.. ఆ దారిన వెళుతున్నవారు అంబులెన్సుకు ఫోను చేశారు. కానీ అంబులెన్స్‌ అక్కడికి చేరుకోవడానికి 25 నిమిషాలకు పైనే పట్టింది. ఆలోపు రాజ్‌భవన్‌ గేట్‌ నంబర్‌ 13 ఎదురుగా మహిళకు ప్రసవం జరిగిపోయింది. ఈ పరిస్థితి గమనించిన స్థానిక మహిళలు చీర అడ్డుగా పెట్టి ఆమెకు ప్రసవం చేశారు.

ఇక్కడ మరో విషాదం ఏంటంటే.. రూపా సోనికి మృతశిశువు జన్మించింది. ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో యోగి సర్కారుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు. అంబులెన్సు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. యోగి ప్రభుత్వం బుల్డోజర్ల మీద పెట్టిన శ్రద్ధ అంబులన్స్‌ల మీద పెడితే బాగుండేది అని విపక్షాలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి