Dharani
Union Budget 2024 LIVE Updates in Telugu: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నేడు ఆమె ధరించే చీర మీద ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. మరి గత బడ్జెట్ల సందర్భంగా ఆమె ధరించిన చీరల విశేషాలు..
Union Budget 2024 LIVE Updates in Telugu: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నేడు ఆమె ధరించే చీర మీద ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. మరి గత బడ్జెట్ల సందర్భంగా ఆమె ధరించిన చీరల విశేషాలు..
Dharani
మరో రెండు మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఎలక్షన్ ముందు నేడు అనగా ఫిబ్రవరి 1, 2024 నాడు ఎన్డీఏ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్కు ఇదే చివరి బడ్జెట్. పార్లమెంట్ కొత్త భవనంలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు 5 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నేడు ఆరో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
అయితే దేశ ప్రజలకు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మీద ఎంత ఆసక్తి ఉంటుందో.. పద్దు సమర్పించే రోజున ధరించే చీర మీద కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. పైగా ప్రతి ఏడాది ఆమె ధరించే చీరలు బడ్జెట్ను ప్రతిబింబించేవిగా ఉంటాయి. అలానే ఈ సారి బడ్జెట్కు ఏ రంగు చీర ధరిస్తారు అనే దాని మీద ఆసక్తి నెలకొని ఉంది. అదలా ఉంచితే.. గత ఐదేళ్లలో బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ ధరించిన చీరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా 2019లో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆమె గులాబీ రంగులో బంగారు అంచు ఉన్న మంగళ గిరి చీరను ధరించారు. అలాగే ఈ ఏడాదే సంప్రదాయ బ్రీఫ్ కేస్ స్థానంలో బహీ ఖాతాను ప్రవేశపెట్టి సరికొత్త ఆచారానికి శ్రీకారం చుట్టారు ఆర్థిక మంత్రి. ఈ బహీ ఖాతా కోసం ఎరుపు రంగు సిల్క్ వస్త్రంలో బడ్జెట్ పేపర్లను చుట్టి తీసుకువచ్చారు.
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. ఇక 2020లో బడ్జెట్ సమర్పణ కోసం నిర్మలా సీతారామన్ పసుపు రంగు సిల్క్ చీర ధరించి పార్లమెంట్కు వచ్చారు. నీలం రంగు అంచుతో పసుపు, బంగారు రంగు చీరను ధరించారు. దీనిలో ఉన్న పసుపు రంగు సంప్రదాయానికి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. చాలా మంది మహిళలు ప్రత్యేక సందర్భాల్లో పసుపు రంగు చీరలు ధరిస్తూ ఉంటారు.
కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 2021 లో మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణకే తలమానికంగా నిలిచే పోచంపల్లి ఇక్కత్ చీరను కట్టుకున్నారు. ఎరుపు, హాఫ్ వైట్ సమ్మేళనంతో డిజైన్ చేసిన పోచంపల్లి ఇక్కత్ సిల్క్ చీరను ధరించారు. దీనికి పల్లు ఇక్కత్ పాటర్స్తో సన్నటి గ్రీన్ బార్డర్ ఉంటుంది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ది పొందిన తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో ఈ చీర తయారైంది.
2022 బడ్జెట్ సమర్పణ సందర్బంగా నిర్మలా సీతారామన్ బ్రౌన్ కలర్ చీర ధరించి పార్లమెంట్కు వచ్చారు. ఒడిశాలో తయారయిన రస్ట్ బ్రౌన్ చీరకు మెరూన్ రంగు బార్డర్, సిర్వర్ కలర్ డిజైన్ ఉంది. బ్రౌన్ కలర్ రక్షణ, భద్రతలను సూచిస్తుంది. ఎరుపు రంగు శక్తిని సూచిస్తుంది. 20222 బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్.. ఈ రెండింటి సమ్మేళనంతో ఉన్న చీరను ధరించారు.
2023లో ఐదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నిర్మలా సీతారామన్.. ఎరుపు రంగు టెంపుల్ బార్డర్ చీర ధరించారు. దీని మీద ఎరుపు, నలుపు కలర్ జరీ బార్డర్, టెంపుల్ డిజైన్ ఉంది. ఈ చీరలు ముఖ్యంగా కాటన్ లేదా సిల్క్లో మాత్రమే లభిస్తాయి. ప్రత్యేక సందర్భాల్లో మహిళలు వీటిని కట్టుకునేందుకు ఇష్టపడుతుంటారు. మరోవైపు.. ఇదే ఏడాది బహీ ఖాతా స్థానంలో ఎరుపు రంగు డిజిటల్ టాబ్లెట్తో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.
మరి ఈ సారి బడ్జెట్ సందర్భంగా ఏ రంగు చీర ధరిస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనాలు. అలానే ఎన్నికల ముందు ప్రవేశపెట్టబోతున్న ఈ పద్దులో సామాన్యులు, మహిళలు, రైతుల సంక్షేమానికి అధిక ప్రధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. మరి నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉండనుందో మరి కాసేపట్లో తెలియనుంది.