iDreamPost

కరోనా కట్టడికి తెలంగాణ కీలక నిర్ణయం

కరోనా కట్టడికి తెలంగాణ కీలక నిర్ణయం

హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కదిలింది. కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. మంగళవారం నుంచి మే ఒకటో తేదీ ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

వీటికి మినహాయింపు..

– అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు.

– ఫార్మసీలు, ల్యాబ్‌లు, ఎలక్ట్రానిక్ , ప్రింటీ మీడియా, పెట్రోల్‌ బంక్‌లు, శీతల గిడ్డంగులు, గోదాములు, అత్యవసర సర్వీసులకు పర్మిషన్.

– విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు మినహాయింపు. అయితే తనిఖీల సమయంలో టికెట్ చూపించాలి.

– వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు, వారి అటెండెంట్లకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.

– ఇంటర్ స్టేట్ ( అంతర్రాష్ట్ర ) రవాణాకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. యధావిధిగా నడుపుకోవచ్చు. ఎలాంటి ప్రత్యేక పాసులు అవసరం లేదు.

– ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లు, ఫార్మసీలు, ఇంటర్‌నెట్‌ సర్వీసులు, బ్రాడ్‌కాస్టింగ్‌, కేబుల్‌ సర్వీసులు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు
ఇ- కామర్స్‌ వస్తువుల డెలివరీకి అనుమతి.

– పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్‌జీ, పెట్రోలియం, గ్యాస్‌ అవుట్‌లెట్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రైవేటే సెక్యూరిటీ సర్వీసులు, ప్రొడక్షన్‌ యూనిట్లకు పర్మిషన్.

ఇవి క్లోజ్..

– రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ళు, థియేటర్స్‌ నిర్వహణకు అనుమతి. తర్వాత హాళ్లు, వార్లు, పబ్ లు, క్లబ్ ల మూసివేత.

– కర్ఫ్యూ సమయంలో సాధారణ పౌరులు బయట తిరగడం నిషేధం.

– ఇతర దుకాణాలు కూడా 8 గంటల కల్లా మూసేయాలి.

Also Read : కేజ్రీవాల్ కూడా అంతేనా..?

హైకోర్టు అల్టిమేటం నేపథ్యంలో..

తెలంగాణలో కేసులు భారీగా పెరుగుతున్నా ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంపై హైకోర్టు మండిపడింది. ప్రజల ప్రాణాల కంటే థియేటర్లు, పబ్‌లు, లిక్కర్ షాపులే ముఖ్యమా అని నిలదీసింది. వీకెండ్ లాక్ డౌన్లు, రాత్రిళ్లు కర్ఫ్యూ పెట్టడంపై 48 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. లేదంటే తామే ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టంచేసింది. జన సంచారాన్ని తగ్గించేందుకు 10 రోజుల కిందటే ఉత్తర్వులు జారీ చేశామని, కానీ ఇప్పటిదాకా వాటిని అమలు చేయలేదని కోర్టు సీరియస్ అయింది. రాజకీయ ర్యాలీలు.. బార్లు.. సినిమా హాళ్లు… పెళ్లిళ్లు.. అంత్యక్రియల్లో రద్దీని ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించింది.  మద్యం దుకాణాల్లో వచ్చే ఆదాయంపై ఉన్న దృష్టి ప్రజల ప్రాణాలపై లేదా? అని నిలదీసింది. ఢిల్లీలో పరిస్థితి చూస్తూ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. మీరు చర్యలు తీసుకుంటారా? లేక మమ్మల్ని ఆదేశాలివ్వమంటారా? 48 గంటల్లో నిర్ణయం తీసుకోండి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వ్యాప్తి తగ్గుతుందా?

కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పుడు ఆంక్షలు పెట్టడం వల్ల.. జనాల రద్దీ తగ్గుతుంది. దీంతో వ్యాప్తి తగ్గడమే కాదు.. నెమ్మదిస్తుంది కూడా. స్ప్రెడ్ అయ్యే వేగం తగ్గుతుంది. కేసులు తగ్గుతాయి. నిజానికి హైదరాబాద్ లాంటి సిటీల్లో.. నైట్ కూడా భారీగా రద్దీ ఉంటుంది. రాత్రిళ్ళు కూడా చాలా బిజినెస్ లు నడుస్తూ ఉంటాయి. ఇక రాత్రి 9 వరకే అనుమతి ఉండటంతో.. షాపులు 8 లోపు క్లోజ్ చేయాలి. అంటే సాయంత్రం 7 గంటలకే దుకాణాల ఓనర్లు.. సర్దుకోవడం మొదలు పెట్టాలి. ఆ ప్రకారం.. సాయంత్రం ఆరు నుంచే రద్దీ తగ్గిపోతుంది. మాల్స్, హాల్స్, బార్స్ కూడా సాయంత్రం పూటనే బిజీగా ఉంటాయి. జనం బారులు తీరుతారు. ఇప్పుడు నైట్ ఇవి క్లోజ్ చేయడం వల్ల వ్యాప్తి తగ్గుతుంది.

మరోవైపు ఈ ఆంక్షల వల్ల హెల్త్ సిస్టమ్ పైనా బరువు తగ్గుతుంది. కేసుల లోడ్ తగ్గి.. ఉన్న పేషంట్లను మరింత జాగ్రత్తగా చూసుకునే వీలు కలుగుతుంది. అయితే జనం కూడా ప్రభుత్వానికి సహకరించాలి. ఆశీర్వాద్ గోధుమ పిండి దొరకలేదని.. లక్స్ సోప్ దొరకలేదని.. బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలి. రెండు చేతులతో కొడితేనే చప్పట్లు వస్తాయి. అందరూ సహకరిస్తే కరోనా అదుపులోకి వస్తుంది.

Also Read : కరోనా సెకండ్ వేవ్ లో కూడా వ్యూహాత్మకంగా జగన్ ప్రభుత్వం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి