iDreamPost

రాజగోపాల్‌ రెడ్డి చేరికతో మునుగోడులో మారిన లెక్కలు.. కాంగ్రెస్‌కు లాభమా.. నష్టమా?

  • Published Oct 26, 2023 | 2:27 PMUpdated Oct 26, 2023 | 2:27 PM

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఆయన రాక కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని భావిస్తోన్న వేళ.. మునుగోడులోని ఆశావాహులు మాత్రం పార్టీని భయపెడుతున్నారు. మరి ఇంతకు రాజగోపాల్‌రెడ్డి రాక వల్ల కాంగ్రెస్‌కు లాభమా.. నష్టమా అంటే..

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఆయన రాక కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని భావిస్తోన్న వేళ.. మునుగోడులోని ఆశావాహులు మాత్రం పార్టీని భయపెడుతున్నారు. మరి ఇంతకు రాజగోపాల్‌రెడ్డి రాక వల్ల కాంగ్రెస్‌కు లాభమా.. నష్టమా అంటే..

  • Published Oct 26, 2023 | 2:27 PMUpdated Oct 26, 2023 | 2:27 PM
రాజగోపాల్‌ రెడ్డి చేరికతో మునుగోడులో మారిన లెక్కలు.. కాంగ్రెస్‌కు లాభమా.. నష్టమా?

అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హస్తం పార్టీ మీద అసంతృప్తితో.. బీజేపీలో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. అయితే తాజాగా ఎన్నికల ముందు.. కమలం పార్టీకి భారీ షాక్‌ ఇస్తూ.. తిరిగి సొంత గూటికి చేరుకున్నారు రాజగోపాల్‌ రెడ్డి. ఇక నల్లగొండలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కి పార్టీలకతీతంగా.. వ్యక్తిగతంగా మంచి ఓటు బ్యాంక్‌ ఉంది. ఈ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికలో.. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలిగారు రాజగోపాల్‌ రెడ్డి. ఈ క్రమంలో ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరడం వల్ల పార్టీకి కలసి వస్తుందని భావిస్తున్నారు.

అయితే ఇది ఒకవైపు మాత్రమే. రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత.. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ఇతరులు చెలామణిలోకి వచ్చారు. ఉప ఎన్నిక నాటి నుంచే మునుగోడు సీటు మీద ఆశలు పెట్టుకుని.. ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి రావడంతో.. సీన్‌ మారింది. ఈ క్రమంలో అసలు రాజగోపాల్‌ రెడ్డి తిరిగి సొంత గూటికి రావడం వల్ల కాంగ్రెస్‌కి లాభమా.. నష్టమా అనే దాని మీద ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాక ప్రస్తుతం రాజగోపాల్‌రెడ్డి రాకతో మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం మొదలయ్యింది అనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

మునుగోడులో పెరిగిన ఆశావాహులు..

రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడంతో.. మునుగోడులో పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి వంటి నేతలు తెర మీదకు వచ్చారు. రాజగోపాల్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన నాటి నుంచి వీరంతా.. ఇక్కడ తమ బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు నేతలు మునుగోడు టికెట్‌ కోసం లైన్‌లో ఉన్నారు.

వీరిలో గతంలో మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌ రెడ్డి మీద కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన పాల్వాయి స్రవంతి ఒకరు కాగా.. మరోకరు రేవంత్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు చలమల కృష్ణారెడ్డి. వీరితో పాటు.. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నా కైలాష్‌ కూడా మునుగోడు టికెట్‌ మీద భారీ ఆశలే పెట్టుకున్నారు. తప్పకుండా తమకే టికెట్‌ వస్తుందనే నమ్మకంతో.. ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే రాజగోపాల్‌ రెడ్డి రాకతో ప్రస్తుతం.. కాంగ్రెస్‌ పార్టీని ఇరకాటంలో పెట్టే సమస్యాత్మక నియోజకవర్గాల జాబితాలో మునుగోడు కూడా చేరిపోయింది.

మునుగోడు టికెట్‌ నీకే అనే హామీతోనే రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లో తిరిగి చేరారు. దాంతో మునుగోడు టికెట్‌ ఆశిస్తున్న వారిలో కంగారు మొదలయ్యింది. పార్టీలు మారే వ్యక్తికి టికెట్‌ ఇస్తే.. మరి ఇన్నాళ్లు విశ్వాసంగా ఉన్న తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ టికెట్‌ రాకపోతే.. తీవ్ర నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నారంట.

వ్యక్తిగత ఓటు బ్యాంకే రాజగోపాల్‌రెడ్డి బలం..

అయితే ఆశావాహులు ఎంత మంది ఉన్నా.. పార్టీకి గెలిపించే అభ్యర్థులే ముఖ్యం. ఇక నల్లగొండలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కి పార్టీలకతీతంగా వ్యక్తిగత ఓటు బ్యాంకు బలంగా ఉంది. మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డికి వ్యక్తిగతంగా అనుచరులు చాలా మంది ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో​ ఆయన కేవలం 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారంటేనే అక్కడ ఆయన ఎంత స్ట్రాంగ్‌ కంటెస్టెంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే కాంగ్రెస్‌ అధిష్టానం.. మునుగోడు సీటు మళ్లీ రాజగోపాల్‌ రెడ్డికే అని హామీ ఇచ్చింది.

రాజగోపాల్‌ రెడ్డి వ్యక్తిగత ఓటు కాంగ్రెస్‌కు కలిసి వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ స్థానికంగా ఉన్న నేతలు కూడా రాజగోపాల్‌రెడ్డికి మద్దుతిస్తేనే.. మునుగోడులో కాంగ్రెస్‌ గెలుపు సాఫీగా సాగుతుంది.. లేదంటే కష్టపడాల్సి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముందు ముందు మునుగోడులో రాజకీయాలు ఎలా మారతాయో చూడాలి అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి