iDreamPost

సహాయంలోనూ మనవాళ్ళు బాహుబలులే

సహాయంలోనూ మనవాళ్ళు బాహుబలులే

కరోనా విపత్తు వల్ల సామాన్యులు నరకం చూస్తున్న వేళ టాలీవుడ్ హీరోలు నిర్మాతలు దర్శకులు తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు. తెరమీద నటించడమే కాదు అవసరమైనప్పుడు జనాన్ని ఆదుకోవడంలోనూ ముందుంటామని ఋజువు చేస్తున్నారు. నిన్న ప్రభాస్ ఏకంగా 4 కోట్ల విరాళాన్ని ప్రకటించడం షాక్ కు గురి చేసింది. బాహుబలి వల్ల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డార్లింగ్ తన వంతు బాద్యతగా 3 కోట్లు ప్రధాని సహాయ నిధికి, చెరో కోటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు డొనేట్ చేశాడు.

ఇప్పటిదాకా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి అత్యధికంగా విరాళం ఇచ్చిన హీరోగా ప్రభాస్ రియల్ లైఫ్ లోనూ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు . అమౌంట్ పరంగా పవన్ 2 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు చెరి 25 లక్షలతో పాటు సినీ కార్మికుల కోసం విడిగా మరో 25 లక్షలు ఇచ్చి మొత్తం డెబ్భై ఐదు లక్షలు ఇచ్చి తన ఉదారతను చాటుకున్నాడు. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నిన్న 200 సంచుల నిత్యావసర వస్తువులను తన సహాయం కోరిన పరిశ్రమ అవసరార్తులకు అందజేశారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా 1 కోటి 25 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఇది చిరంజీవి ఇచ్చిన మొత్తం కన్నా ఎక్కువ కావడం విశేషం. సంగీత సంచలనం తమన్ తన వంతుగా 5 లక్షలు అనౌన్స్ చేశాడు.

సాయి ధరం తేజ్ 10 లక్షలు, వివి వినాయక్ 5 లక్షలు ఇచ్చారు. తాను నటిస్తున్న నాంది సినిమా షూటింగ్ ఆగిపోవడం వల్ల తాత్కాలిక ఉపాధి కోల్పోతున్న యూనిట్ సభ్యులకు అల్లరి నరేష్ 5 లక్షల సహాయాన్ని ప్రకటించారు. నిన్న రామ్ చరణ్, చిరంజీవి, మహేష్ బాబు, త్రివిక్రమ్ తదితరులు ఇచ్చిన మొత్తాలు కూడా భారీగా ఉన్న సంగతి తెలిసిందే. సమాజం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా ఆపన్న హస్తం అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చాటిన మన టాలీవుడ్ సెలబ్రిటీల ఉదార గుణం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇవాళ కూడా ఇదే తరహా స్పందన వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి