iDreamPost

బంగ్లాతో సిరీస్‌ కోసం భారత జట్టుకు ఎంపికైన ముగ్గురు ఆంధ్రా క్రికెటర్లు

బంగ్లాతో సిరీస్‌ కోసం భారత జట్టుకు ఎంపికైన ముగ్గురు ఆంధ్రా క్రికెటర్లు

టీమిండియాలో చోటు దక్కడం అంటే చాలా అదృష్టంగా భావిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కేవలం పురుషుల్లోనే కాకుండా మహిళల విభాగంలో కూడ మిథాలీ రాజ్ వంటి వారు భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఇక తాజాగా ఏపీ  నుంచి మరో ముగ్గురు యువతులు టీమిండియాకు ఎంపికయ్యారు. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్ తో  జరగనున్నటోర్నీలో ఈ ముగ్గురు యువతులు భారత మహిళ జట్టు తరపున ఆడనున్నారు. దీంతో వారి కుటుంబాలు సంతోషంలో మునిగి తేలుతున్నాయి.  ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…

జులై 9న బంగ్లాదేశ్ తో మొదలయ్యే వన్డే, టీ20 సిరీస్ లకు సెలెక్టర్లు ఎంపిక  చేసిన టీమిండియాలో  అనంతపురం జిల్లాకు చెందిన బి. అనూష, కర్నూలు జిల్లాకు చెందిన అంజలి శర్వాణి,  ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎస్. మేఘన్ ఎంపికయ్యారు. అనూష, అంజలి వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకోగా.. మేఘన పొట్టి ఫార్మాట్లో మాత్రమే ఆడనుంది. ఒక్కేసారి ఏపీ నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.  తెలుగు రాష్ట్రాల నుంచి ఒకేసారి ఇంతమంది నేషనల్ టీమ్ కు ఎంపికవ్వడం ఇదే మొదటి సారి. పురుషుల జట్టులో కూడా ఒక్కేసారి ఇంతమంది తెలుగు  రాష్ట్రాల నుంచి ఎంపికైన దాఖాలలు లేవు.

ఇక బంగ్లాదేశ్ పర్యటన విషయానికి వస్తే.. 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళ జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. గాయంతో పేసర్‌ రేణుక సింగ్‌ దూరం కాగా, వికెట్‌ కీపర్‌  రిచా ఘోష్‌ను ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (టి20, వన్డే) పక్కనబెట్టారు. యువ స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్‌కు సెలక్టర్లు అవకాశమివ్వలేదు.ఈ పర్యటనలో టీమిండియా, బంగ్లాదేశ్ జట్టులు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ లు ఆడనున్నాయి. ఈనెల 9, 11, 13 తేదీల్లో టి20 మ్యాచ్‌లు, అదే స్టేడియంలో 16, 19, 22 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్ లు అన్ని మీర్ పూర్ లోని షేర్ ఎ బంగ్లా నేషనల్  క్రికెట్ స్డేడియంలో జరగనున్నాయి.

టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), దీప్తిశర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, హర్లీన్‌ డియోల్, దేవిక వైద్య, ఉమా చెత్రి(వికెట్ కీపర్), అమన్‌జోత్‌ కౌర్, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ, మేఘన సింగ్, మోనిక పటేల్, రాశి కనోజియా, అనూష బారెడ్డి, మిన్నురాణి.  ఇక వన్డే జట్టు విషయానికి వస్తే.. అదే జట్టు కాస్తా మార్పులు చేశారు. సబ్బినేని మేఘన, మిన్నురాణి స్థానాల్లో ప్రియా పూనియా, స్నేహ రాణాలను బీసీసీఐ ఎంపిక చేసింది. మరి.. తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు టీమిండియాకు ఎంపిక కావడపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి