iDreamPost

చిరంజీవి, భానుచందర్ ఇప్పుడు బెల్లం హీరో

చిరంజీవి, భానుచందర్ ఇప్పుడు బెల్లం హీరో

ఒకప్పుడు స్టువర్ట్ పురం అనే ఊరు దొంగలకు ప్రసిద్ధి. రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినా అక్కడికి లింక్ ఉండేదని అప్పట్లో కథలుగా చెప్పుకునేవారు. ఆ సమయంలో అక్కడి అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయాలన్నా మహా ఇబ్బందిగా ఉండేది పిల్లనిచ్చేవాళ్ళు దొరక్క. ఈ బ్యాక్ డ్రాప్ లో నేరుగా ఊరి పేరుని ప్రస్తావిస్తూ వచ్చిన సినిమాలు రెండు. ఒకటి చిరంజీవి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్. రెండు భానుచందర్ స్టువర్ట్ పురం దొంగలు. 1991 జనవరిలో రెండూ కేవలం వారం గ్యాప్ లో విడుదల కావడం విశేషం. అనూహ్యంగా మెగాస్టార్ మూవీ డిజాస్టర్ కాగా రెండోది కమర్షియల్ గా సేఫ్ అయ్యింది. మీడియాలో ఇది బాగా హై లైట్ అయ్యింది.

కట్ చేస్తే కాలక్రమేణా ఇదంతా చరిత్రలో కలిసిపోయింది. సమాజం మొత్తం దొంగలే అయినప్పుడు ప్రత్యేకంగా స్టువర్ట్ పురం గురించి చెప్పడానికి ఏముంటుంది. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఆ టైటిల్ తో ఓ చిత్రం రాబోతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ శిష్యుడు కెఎస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించబోయే సినిమాకు స్టువర్ట్ పురం దొంగ అనే పేరు ఫిక్స్ చేశారు. ఆ కాలంలో పోలీసులను గడగడలాడించిన నాగేశ్వర్ రావు కథ ఆధారంగా యిది రూపొందుతుందట. ఈయనికి టైగర్ అనే బిరుదు ఉంది. ఇదే పాయింట్ తో రవితేజ కూడా ఓ మూవీ చేయబోతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ఈ ప్రకటన రావడం విశేషం

ప్రస్తుతం ఛత్రపతి హిందీ రీమేక్ లో బిజీగా ఉన్న సాయి శ్రీనివాస్ అది కాగానే ఇది మొదలుపెట్టబోతున్నాడు. టీమ్ కూడా గట్టిగానే సెట్ చేసుకున్నారు. కథ 1970 ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా సెట్లు వేయబోతున్నారు. వెన్నెలకంటి బ్రదర్స్ రచన చేయనుండగా మణిశర్మ సంగీతం, శ్యామ్ కె నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. బడ్జెట్ పరంగా భారీగా ఖర్చు జరగబోతోంది. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం టాలీవుడ్ టచ్ చేసిన కాన్సెప్ట్ మళ్ళీ ఇప్పుడు సాయి శ్రీనివాస్ టచ్ చేయనుండటం విశేషం. షూటింగ్ త్వరలో అన్నారు కానీ ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు

Also Read : సినిమా హాళ్లు తెరిచినందుకే టెన్షన్ వచ్చిందా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి