Revanth Reddy: విద్యార్థులకు CM రేవంత్‌ రెడ్డి శుభవార్త.. ఇక ఫీజుల టెన్షన్‌ లేదు

Revanth Reddy-Fees Reimbursement: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విద్యార్థులకు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులపై ఫీజుల టెన్షన్‌ తొలగిపోనుంది. ఆ వివరాలు..

Revanth Reddy-Fees Reimbursement: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విద్యార్థులకు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులపై ఫీజుల టెన్షన్‌ తొలగిపోనుంది. ఆ వివరాలు..

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌ రెడ్డి.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను మాత్రమే కాక.. ప్రజా సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్లు ప్రకటించిన రేవంత్‌ రెడ్డి.. తాజాగా వారికి మరో శుభవార్త చెప్పారు. సీఎం నిర్ణయంతో ఫీజుల టెన్షన్‌ తప్పనుంది అంటున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

తెలంగాణ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి.. ఎలాంటి పెండింగులు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్స్ అందిస్తామని ప్రకటించారు. శుక్రవారం జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో నిర్వహించిన “క్వాలిటీ ఇంజనీరింగ్ సదస్సు”లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో తొలిసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.

అయితే.. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా.. చాలా వరకు పెండింగ్ పెట్టిందని ఆరోపించారు. అందువల్ల ‍కాలేజీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో అలాంటి పరిస్థితి రాదని.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక బకాయిలను కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసేలా.. మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ విషయంపై ఆర్థిక శాఖతో మాట్లాలని శ్రీధర్ బాబుకు సూచించారు.

ఇక.. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా ల్యాండ్ మార్క్‌గా ఉన్న ప్రదేశాలన్ని ఇంజనీర్ల గొప్పతనానికి నిదర్శనాలే అన్నారు రేవంత్‌ రెడ్డి. అలాంటి ఇంజనీర్లను తయారు చేస్తున్న కాలేజీలకు సహయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్‌ కాలేజీలు.. నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా మారకూడదని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రతి ఏటా బటయటకు వస్తున్న ఇంజనీర్లు నిరుద్యోగులుగా కాకుండా.. ఉపాధి పొందే నిపుణులుగా తయారు చేసే బాధ్యత.. కళాశాలలపైనే ఉందని సూచించారు.

అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైన కోర్సు సివిల్ ఇంజనీరింగ్ అని.. అలాంటింది కొన్ని కళాశాలల్లో సివిల్ ఇంజనీరింగ్ లేకుండా చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో కచ్చితంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను నడపాలని సూచించారు. ఇంజినీరింగ్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ మూడు కోర్సులు లేకపోతే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని చెప్పుకొచ్చారు.

అంతేకాక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంజనీరింగ్ కాలేజీల్లో కోర్సులు ఉండాలని, ఫార్మా, ఐటీ, ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతోందన్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏఐకి సంబంధించిన కోర్సు కూడా ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సూచించారు. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఏఐకి సంబంధించిన కోర్సులు ప్రవేశపెడితే సర్కారు నుంచి ప్రోత్సాహకాలు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Show comments