ఇంత సాధించినా.. సచిన్ కన్నా కోహ్లీ గొప్ప అని ఎందుకు ఒప్పుకోలేం?

1983లో వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టుకు సరైన ఆర్థిక సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్న బీసీసీఐ.. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డుగా ఎదగడానికి కారణం ఒకే ఒక్కడు.. అతను ఎవరో? టీమిండియాకు దేవుడు ఎవరో? అసలు సచిన్‌- కోహ్లీ ఇద్దరిలో ఎవరు గొప్పో ఇప్పుడు చూద్దాం..

1983లో వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టుకు సరైన ఆర్థిక సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్న బీసీసీఐ.. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డుగా ఎదగడానికి కారణం ఒకే ఒక్కడు.. అతను ఎవరో? టీమిండియాకు దేవుడు ఎవరో? అసలు సచిన్‌- కోహ్లీ ఇద్దరిలో ఎవరు గొప్పో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. టీమ్‌లోని అందరు ఆటగాళ్లు సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో.. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనబరస్తూ.. టైటిల్‌ ఫేవరేట్‌గా దూసుకెళ్తోంది. అయితే.. ఈ టోర్నీలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే ఓ సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలు సాధించి మంచి దూకుడు కనబరస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి విరాట్‌ కోహ్లీ- ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పోల్చుతూ.. కొంతమంది చర్చకు దారితీస్తున్నారు. ఇప్పుడనే కాదు.. గతంలోనూ అనేక సందర్బాల్లో సచిన్‌తో కోహ్లీని పోలుస్తూ.. ఇద్దరిలో ఎవరు గొప్ప బ్యాటర్‌ అనే ప్రశ్న లేవనెత్తుతూ ఉంటారు క్రికెట్‌ ఫ్యాన్స్.

నిజానికి.. సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ గొప్ప ఆటగాళ్లు. క్రికెట్‌ ప్రపంచానికి దొరికిన ఆణిముత్యాలు. పైగా వీళ్లిద్దరూ మన దేశంలోనే పుట్టడం.. మన అదృష్టమే అనుకోవాలి. అయితే.. సచిన్‌ ఆట చూసిన చాలా మంది మళ్లీ ఇలాంటి క్రికెటర్‌ ఈ భూమ్మీద పుడతాడా? అని అనుకునే వాళ్లు. కానీ, విరాట్‌ కోహ్లీ రూపంలో.. సచిన్‌ శకం ముగుస్తుండగానే.. ఓ కాంతిరేఖలా పుట్టుకొచ్చాడు విరాట్‌. సచిన్‌ యుగం ముగిసిన తర్వాత పెద్దగా గ్యాప్‌ ఇవ్వకుండానే సచిన్‌ స్థాయిని, స్థానాన్ని అందుకోవాడానికి కోహ్లీ పరుగులు పెట్టాడు. టన్నుల కొద్ది పరుగులు, సెంచరీల మీద సెంచరీలు చేస్తూ.. ఒకానొక దశలో సచిన్‌ను మించిపోయాడు. కొంతమందికి ఇది నచ్చకపోయినా.. ఇదే నిజం. వన్డే క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీనే గ్రేటెస్ట్‌ బ్యాట్సెమన్‌. అందుకు అతని గణాంకాలే నిదర్శనం. వన్డే క్రికెట్‌లో సచిన్‌ను కోహ్లీ ఎప్పుడో దాటేశాడు. అనేక రికార్డుల విషయంలో సచిన్‌ కంటే మెరుగ్గా ఉన్నాడు కోహ్లీ.

సచిన్‌ టెండూల్కర్‌ తన కెరీర్‌లో మొత్తం 463 వన్డేలు ఆడాడు. 452 ఇన్నింగ్స్‌ల్లో 44.83 సగటుతో 18426 పరుగులు చేశాడు. 86.24 స్ట్రైక్‌రేట్‌ కలిగి ఉన్నాడు. వన్డే కెరీర్‌లో 49 సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ, 96 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 2016 ఫోర్లు, 195 సిక్సులు కొట్టాడు. అత్యధిక స్కోర్‌ 200. ఇక ఇప్పటి వరకు కోహ్లీ వన్డే కెరీర్‌ను పరిశీలిస్తే.. 285 వన్డేల్లో 273 ఇన్నింగ్స్‌లు ఆడి 58.01 సగటుతో 13342 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 93.71గా ఉంది. ఇప్పటి వరకు 48 సెంచరీ, 68 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. 1247 ఫోర్లు, 147 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్‌ 183. అయితే.. కోహ్లీ కంటే.. రన్స్‌లో, సెంచరీల్లో, హాఫ్‌ సెంచరీల్లో సచిన్‌ ముందే ఉన్నాడుగా అని మీరు అనుకోవచ్చు. కానీ, ఒక్కసారి మ్యాచ్‌ల సంఖ్యపై లుక్‌ వేయండి. సచిన్‌ 463 వన్డేలు ఆడితే.. కోహ్లీ కేవలం 285 వన్డేల్లోనే ఇలాంటి నంబర్స్‌ క్రియేట్‌ చేశాడు. వాళ్లిద్దరూ ఆడిన మ్యాచ్‌ల సంఖ్యను బట్టి చూస్తే.. విరాట్‌ ఎంతో ముందు ఉన్నట్టే. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 26 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న తొలి క్రికెటర్‌ కోహ్లీనే. గతంలో కూడా వేగంగా పలు మైలురాళ్లను అధిగమించాడు. అయినా కూడా.. సచిన్‌ కంటే కోహ్లీనే గొప్ప అంటే ఇప్పటికీ చాలా మంది ఒప్పుకోరు. ఎందుకంటే..

సచిన్‌ టెండూల్కర్‌ అంటే జస్ట్‌ క్రికెటర్‌ మాత్రమే కాదు. కోట్ల మంది భారతీయుల ఎమోషన్‌. అసలు ఇండియాలో క్రికెట్‌కు ఈ స్థాయి, క్రేజ్‌ తీసుకొచ్చిందే అతను. అతని ఆట చూసే.. చాలా మందికి క్రికెట్‌ ఓ పిచ్చిలా పట్టుకుంది. సచిన్‌ ఆట చూస్తూ పెరిగిన ఎవరికీ కూడా సచిన్‌ను మించిన ఆటగాడు పుట్టడు అనే అనిపిస్తుంది. ఎందుకంటే.. ఇండియా అంటే సచిన్‌.. సచిన్‌ అంటే ఇండియాలా సాగింది అతని యుగం. ప్రత్యర్థి టీమ్‌లోని 11 మంది కూడా సచిన్‌ ఒక్కడితోనే ఆడుతున్నాం.. అతన్ని ఔట్‌ చేస్తే చాలు, గెలిచినట్లే అని భావించి ఆడేవాళ్లు. ఒకానొక దశలో బీసీసీఐతో సమానంగా స్పాన్సర్లు ఉన్న ఏకైక ఆటగాడు సచిన్‌. 1983లో వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టుకు సరైన ఆర్థిక సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్న బీసీసీఐ.. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డుగా ఎదగడానికి కారణం ఒకే ఒక్కడు.. అతనే సచిన్‌ టెండూల్కర్‌. ఇండియాలో క్రికెట్‌ను ఓ మతంలా మార్చింది అతనే. అందుకే.. సచిన్‌ అంటే క్రికెటర్‌ మాత్రమే కాదు. క్రికెట్‌ అనే మతానికి దేవుడు.

అందుకే.. కేవలం లెక్కలు మాత్రమే సచిన్‌ కంటే గొప్ప ఆటగాడిగా ఎవర్నీ నిలబెట్టలేవు. సచిన్‌ను దాటాలంటే లెక్కల దాటితే సరిపోదు. విరాట్‌ కోహ్లీ ఇన్ని అద్భుతాలు చేస్తున్నా కూడా చాలా మంది క్రికెట్‌ అభిమానులు.. సచిన్‌ కంటే కోహ్లీ గొప్ప అని ఒప్పుకోలేరు. ఒప్పుకోరు కూడా. సచిన్‌ అంటే ఒక చరిత్ర.. సచిన్‌ అంటే ఒక ఘనత.. సచిన్‌ అంటే నడిచే క్రికెట్‌ టెక్ట్స్‌బుక్‌. రికార్డుల విషయంలో సచిన్‌ కంటే కోహ్లీ మెరుగ్గా ఉన్నా.. కోహ్లీ కూడా గొప్ప ఆటగాడే అయినా.. సచిన్‌ అంటే ఏదో తెలియని ఎమోషన్‌. అందుకే సచిన్‌ను మించి అంటే తట్టుకోలేరు, ఒప్పుకోలేరు. ప్రాక్టీకల్‌గా సచిన్‌ని కోహ్లీ ఎప్పుడో దాటేసినా.. సచిన్‌నే ‍గ్రేట్‌. అయినా.. రెండు స్వర్ణయుగాలకు కొంత గ్యాప్‌ అనేది ఉండాలి. కానీ, సచిన్‌-కోహ్లీ విషయంలో ఆ గ్యాప్‌ అనేది లేదు. సచిన్‌ అవతారం చాలించిన వెంటనే కోహ్లీ అవతారమెత్తాడు. అందుకే.. అంత ఈజీగా సచిన్‌ను మర్చిపోయి కోహ్లీని గోట్‌గా ఒప్పుకోవడం సాధ్యం కాట్లేదు. చివర్లో ఒక్క మాట.. సచిన్‌-కోహ్లీ మధ్య ఎవరు గొప్ప అనేదాని కంటే.. ఆ ఇద్దరూ టీమిండియాలో ఉండటం మన అదృష్టంగా భావిద్దాం.. మన దేశంలో ఇలాంటి సచిన్‌లు, కోహ్లీలు మరింత మంది పుట్టాలని ఆశిద్దాం.

ఇదీ చదవండి: ఆ పాట వింటే పాకిస్థాన్‌ చెలరేగిపోతుంది! స్టేడియంలో పెట్టొద్దన్న రోహిత్‌ శర్మ

Show comments