దుమ్ములేపిన సూర్యకుమార్‌! మరోసారి సత్తా చాటిన తెలుగు తేజం

హమ్మయ్య.. ఎట్టకేలకు టీమిండియా వెస్టిండీస్‌పై విజయం సాధించింది. రెండు వరుస ఓటములతో ఎదురైన విమర్శలకు టీ20 క్రికెట్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌కు పౌరుషం వచ్చినట్లుంది. అందుకే తన స్థాయికి తగ్గట్లు విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించి.. ఈ సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచాడు. మంగళవారం గయానా వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో తొలి రెండు ఓటములను మర్చిపోతూ.. జరగాల్సిన మరో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించేందుకు భారత యువ జట్టు దృష్టి పెట్టింది. అయితే.. ఈ మ్యాచ్‌లో చాలా కాలంగా ఫామ్‌లో లేని సూర్యకుమార్‌ యాదవ్‌ తిరిగి టచ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ ఆరంభంలో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసింది. ఆ జట్టు ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌ తొలి వికెట్‌కు 55 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. అక్షర్‌ పటేల్‌ భారత్‌కు తొలి బ్రేక్‌ త్రూ అందించాడు. ఇక ఆ తర్వాత నుంచి విండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కానీ, ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌(42), కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌(40) పరుగులతో రాణించారు. అలాగే నికోలస్‌ పూరన్‌ సైతం 20 రన్స్‌ చేసి పర్వాలేదనిపించాడు. మొత్తం మీద నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి వెస్టిండీస్‌ 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఈ మ్యాచ్‌తో జట్టులోకి తిరిగొచ్చిన కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అలాగే అక్షర్‌ పటేల్‌, ముఖేష్‌ కుమార్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.

160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ను పక్కనపెట్టి.. యశస్వి జైస్వాల్‌ను ఆడించారు. కానీ, అతను దారుణంగా నిరాశ పరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి.. తొలి ఓవర్‌లోనే అవుట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తన ఫేలవ ఫామ్‌ను కొనసాగించి.. 11 బంతుల్లో 6 పరుగులు చేసి వికెట్‌ సమర్పించుకున్నాడు. దీంతో టీమిండియాకు మరో ఓటమి తప్పదని అంతా భావించారు. కానీ, మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ జోడీ టీమిండియాను విజయతీరాలకు నడిపించింది. సూర్య 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో విధ్వంసం సృష్టిస్తే.. తిలక్‌ వర్మ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జస్ట్‌ ఒక్క పరుగుతో తన రెండో హాఫ్‌ సెంచరీని మిస్‌ చేసుకున్నాడు.

సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సూర్య.. విజయానికి కొద్ది దూరంలో అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్‌ పాండ్యా(20 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా తిలక్‌తో కలిసి మ్యాచ్‌ ముగించాడు. మొత్తం మీద 17.5 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి టీమిండియా 164 పరుగులు చేసి గెలిచింది. 83 పరుగులతో చెలరేగిన సూర్యకుమార్‌ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ విజయంతో టీమిండియా ఐదు టీ20ల సిరీస్‌ను సజీవంగా ఉంచుకుంది. మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే టీమిండియానే సిరీస్‌ విజేతగా నిలుస్తుంది. ఒక్క మ్యాచ్‌ ఓడినా విండీస్‌దే సిరీస్‌. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. టీమిండియాదే వరల్డ్‌ కప్‌! ఇదే సాక్ష్యం

Show comments