Asia Cup: భారత్‌-పాక్‌ మరో పోరుకు రంగం సిద్ధం! మ్యాచ్‌ ఎప్పుడంటే?

ఆసియా కప్‌ 2023లో భాగంగా గ్రూప్‌-ఏ నుంచి పాకిస్థాన్‌, ఇండియా సూపర్‌ ఫోర్‌ దశకు చేరుకున్నాయి. ఇక గ్రూప్‌-బీ నుంచి ఇవాళ శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో సూపర్‌ ఫోర్‌కు వెళ్లే జట్లు ఏవో తెలిసిపోతుంది. శ్రీలంక గెలిస్తే.. లంకతో పాటు బంగ్లాదేశ్‌ సూపర్‌ 4కు చేరుకుంటాయి. ఒకవేళ ఆఫ్ఘనిస్థాన్‌ గెలిస్తే.. లంక, అఫ్ఘాన్‌, బంగ్లాదేశ్‌లు తలో రెండు పాయింట్లతో సమవుజ్జీలుగా నిలుస్తాయి. దీంతో నెట్ రన్‌రేట్‌ ఎక్కువగా ఉన్న రెండు జట్లు సూపర్‌ ఫోర్‌కు వెళ్తాయి.

ఇలా సూపర్‌ ఫోర్‌కు వెళ్లిన నాలుగు జట్లు.. మూడేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. దీంతో సూపర్‌ ఫోర్‌ దశలో ఇండియా-పాకిస్థాన్‌ మధ్య ఈ నెల 10న కోలంబో వేదికగా మ్యాచ్‌ జరగనుంది. 12న ఇండియా గ్రూప్‌ బీలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో మ్యాచ్‌ ఆడుతుంది. 15న గ్రూప్‌ బీలో రెండో స్థానంలో నిలిచి సూపర్‌ ఫోర్‌కు వచ్చిన టీమ్‌తో మ్యాచ్‌ ఆడుతుంది. సూపర్‌ ఫోర్‌ దశలో టాప్‌ 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఆసియా కప్‌ 2023 ఫైనల్‌ ఆడుతాయి.

ఇలా సూపర్‌ ఫోర్‌లో 10న ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఉండటంతో క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయినా.. కనీసం ఈ మ్యాచ్‌ అయినా సవ్యంగా సాగాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. సూపర్‌ ఫోర్‌లో ఇండియా-పాక్‌ మ్యాచ్‌కు రిజర్వర్‌ డే కూడా కేటాయించే అవకాశం ఉండటం విశేషం. ఇక సూపర్‌ ఫోర్‌ గ్రూప్‌ బీ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌ వస్తే.. ఆ రెండు జట్లపై పాక్‌, భారత్‌ విజయం సాధించి, సూపర్‌ ఫోర్‌లో టాప్‌ 2లో నిలిస్తే.. ఆసియా కప్‌ చరిత్రలో తొలి భారత్‌-పాక్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. మరి 10న భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌లో గెలుపుఎవరిదని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Asia Cup: నేపాల్‌తో మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

Show comments