ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ గురించి మీడియాతో మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి నిధులు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని వెల్లడించారు. ఇలా డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యం అవుతుందా ? అని ఆయన ప్రశ్నించారు. ఎకరాకు 2 కోట్లు అవసరం అవుతుందని సీఎం లెక్కలతో సహా అసెంబ్లీ వేదికగా చెప్పారని, ఇలా కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి కోసం లక్షలకోట్లు ఖర్చుపెడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అసలు లక్షకోట్లతో రాజధాని నిర్మించడం ఏంటి ? నిధులు ఉంటే సింగపూర్ కాకపోతే దాని తాతను రాజధానిగా నిర్మించవచ్చు అని సజ్జల అన్నారు. ఆచరణ సాధ్యంకాని ఆదేశాలు కాబట్టి సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారని ఆయన వెల్లడించారు.
మరోపక్క కొత్త జిల్లాలకు సంబంధించి కసరత్తు మొత్తం పూర్తయిందని, ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రకఘట్టం అని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. పార్లమెంట్ కేంద్రాలను బేస్ చేసుకొని జిల్లాలు విభజన చేశామని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉండబోతుందని సజ్జల పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా మనో భావాలు దెబ్బతినకుండా జిల్లాలు ఏర్పాటు చేశామని అన్నారు. చిన్న చిన్న మార్పులతోనే తుది నోటిఫికేషన్ వెలువడనుందని అన్నారు.
పౌర సంఘాలు ఇచ్చిన సలహాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని, అలాగే 90 శాతం ప్రభుత్వ భవనాల్లో కొత్త జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కొత్త జిల్లాల్లో అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఒకే చోట ఉండేలా నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. కొత్తగా నిర్మించే శాశ్వత భవనాలు 15 ఎకరాల్లో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారని సజ్జల పేర్కొన్నారు. 2023 నాటికి మొత్తం కొత్త జిల్లాల శాశ్వత భవనాలు పూర్తవుతాయని, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వైసీపీ శ్రేణులను మోటివేట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక ఎంతో ఆసక్తి రేపుతున్న మంత్రివర్గం విస్తరణ మొత్తాన్ని సీఎం చూస్తున్నారని, సామాజిక న్యాయం జరిగే విధంగా మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేసేలా క్యాబినెట్ మార్పు ఉంటుందని ఆయన వెల్లడించారు.