దశావతారాల్లో ఏడవ అవతారం శ్రీ రాముని అవతారం అని హిందువులు నమ్ముతూ ఉంటారు. రావణ సంహరనార్ధమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడని ప్రతీతి. అందుకే ప్రతి సంవత్సరం అదే రోజు శ్రీరామనవమి పండగ జరుపుకుంటారు.
అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యకు “పుత్ర కామేష్టి యాగం” ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. శ్రీరాముని జనన సమయంలో రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పుతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు. రాముడిగా జన్మించిన మహావిష్ణువు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. అంతే కాదండోయ్ మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించి రాముడు అనగానే మంచి బాలుడు అని టక్కున చెప్పేలా చేశారు.
శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఈ రోజు రాముడికి పూజలు జరుగుతాయి. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజు హిందువులు ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజునే శ్రీ రాముని వివాహం జరిగిందని నమ్మిక. పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమే అని అంటుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం, ఒంటిమిట్ట లాంటి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలలో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి.