పొగ తాగకండి.. పోతారు

మీరు చదివింది కరెక్టే. పొగ తాగితే పోతారు..ఇది మేము చెబుతున్నది కాదండోయ్. కరోనా వ్యాధి తీవ్రత పై పరిశోధన చేస్తున్న వారు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 లక్షల మందికి వ్యాపించి, లక్ష మందికి పైగా పొట్టన పెట్టుకున్న ఈ కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో అత్యధిక శాతం మంది పొగతాగే అలవాటు ఉన్నవారేనని పరిశోధకులు చెబుతున్న మాట. పొగత్రాగడం కారణంగా దాదాపు మూడు వేల రకాల విష రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. తద్వారా అనేక రకాల వ్యాధులకు కారణమవుతాయని ఇప్పటివరకు అందరికీ తెలిసిందే.

అయినప్పటికీ సినిమాలో వచ్చే ‘ముఖేష్’ యాడ్ తలుచుకుంటూ మరి దమ్ము కొట్టే వారి సంఖ్య మన దేశంలో తక్కువ లేదు. అయితే తాజాగా ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా కూడా తన ప్రతాపాన్ని ముందుగా పొగత్రాగే వారి పైనే చూపుతోందని ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. రెస్పిరేటరీ సిస్టమ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న ఈ వ్యాధి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కంటే చికిత్స పొందుతున్న వారే అత్యధికంగా ఉండటం వైద్య రంగాన్ని ఆందోళన పెడుతుంది. వ్యాధి బారిన పడిన వారు ఎప్పుడూ కొలుకుంటారు అన్నదానికి ఖచ్చితమైన కాలవ్యవధి లేకపోగా.. మరింత మందికి వ్యాధి వ్యాపిస్తుంది ఉండడం వారి ఆందోళనకు ప్రధాన కారణం. మనుషుల వ్యాధినిరోధకత, వారి జీవన విధానం, రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేసే అలవాట్లు.. కరోనా బారినపడి పడేయడంలో కీలకం గా ఉంటున్నాయి

వి ఆర్ కే డైట్ ద్వారా పాపులారిటీ పొందిన వీరమాచినేని రామకృష్ణ కూడా మీడియాలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తన డైట్ పై చైనాలో పరిశోధన చేస్తున్న ఆయన అక్కడ నిపుణులతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని గుర్తించామని చెప్పారు. వ్యాధి ప్రారంభమైన చైనాతో పాటు విస్తృతంగా వ్యాపిస్తున్న యూరోపియన్ దేశాలలో వారిని కూడా గమనిస్తే ఈ అంశం స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వాలు కచ్చితంగా పొగ తాగడాన్ని నిషేధించాలని ఆయన సూచించారు.

సో.. సిగరెట్ మానేయడానికి ఏదో ఒక కారణం కావాలి అనుకునే వాళ్లకు ఇంతకంటే పెద్ద కారణం దొరక్కపోవచ్చు. మీకున్న వ్యసనాన్ని మానేసి మీతో పాటు చుట్టుపక్కల వాళ్ళకి కూడా మేలు చేస్తారో.. లేదా పొంచి ఉన్న కరోనా ను దమ్ము కొడుతూ ఆహ్వానం పలుకుతారో ఇక మీ ఇష్టం.

Show comments