నేడు సీఎం జగన్‌ తూర్పు పర్యటన.. బిర్లా కంపెనీ ప్రారంభోత్సం..

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, బలభద్రపురం గ్రామంలో ఆదిత్యా బిర్లా గ్రూపు నిర్మించిన గ్రాసిమ్‌ కాస్టిక్‌ సోడా ప్లాంట్‌ను సీఎం జగన్‌ ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమారమంగళం బిర్లా హాజరవుతున్నారు.

సీఎం పర్యటన ఇలా..

సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నుంచి బయలుదేరి ఉదయం 10:50 గంటలకు బలభద్రపురంలోని గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11:05 గంటలకు గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ప్లాంట్‌కు ప్రత్యేక వాహనంలో కుమారమంగళం బిర్లాతో కలసి వెళతారు. ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం సభలో పాల్గొంటారు. 12:40 గంటలకు తిరిగి సీఎం జగన్‌ తాడేపల్లి బయలుదేరుతారు.

2700 కోట్ల రూపాయలతో ప్లాంట్‌..

ఆదిత్యా బిర్లా గ్రూపు కంపెనీ బలభద్రపురంలో 2,700 కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ స్థాయిలో కాస్టిక్‌ సోడా ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌ ఏర్పాటు ద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చొరవతో ఆదిత్యా బిర్లా గ్రూపులో ఒకటైన గ్రాసిమ్‌ కంపెనీ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాల విభజన తర్వాత రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు అయిన తొలి కంపెనీ ఇదే కావడం గమనార్హం. వ్యవసాయానికి పేరుగాంచిన తూర్పుగోదావరిలో పారిశ్రామిక ప్రగతి కూడా పరుగులు పెడుతుండడం విశేషం.

Show comments