జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతి ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించిన శ్యామ్ చేతిపై కత్తి గాట్లు, గాయాలు ఉన్నాయి. శ్యామ్ ఆత్మహత్య చేసుకోలేదని.. అతడిని ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అతని మృతిపై విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. శ్యామ్ కు గంజాయి అలవాటు లేదని స్పష్టం చేస్తున్నారు. అతని జేబులో కావాలనే గంజాయి ప్యాకెట్లు పెట్టారంటూ ఆరోపిస్తున్నారు. శ్యామ్ మృతిపై గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్యామ్.. తారక్ కు వీరాభిమాని. జూనియర్ ఎన్టీఆర్ కార్యక్రమం ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లిపోతాడు. ఇటీవల ధమ్మీ సినిమా ఈవెంట్ లో తారక్ తో ఫొటో దిగేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డులు శ్యామ్ ని లాక్కెళ్లిపోతారు. అప్పుడు తారక్ శ్యామ్ ని పిలిచి మరీ సెల్ఫీ ఇస్తాడు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఇప్పుడు ఇలా శ్యామ్ విగతజీవిగా మారడం అందరినీ కలచి వేస్తోంది. అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు అంటూ ఆరోపిస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ ఫర్ శ్యామ్ ఎన్టీఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ని ట్రండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై స్వయంగా తారక్ స్పందించాడు. ఒక స్టేట్మెంట్ ని విడుదల చేశాడు. “శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎలాంటి పరిస్థితిలో ఎలా చనిపోయి ఉంటాడో తెలియక పోవడం మనసుని కలచి వేస్తోంది. ప్రభుత్వ అధికారులు ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు. తారక్ కూడా కోరడంతో శ్యామ్ మృతిపై కచ్చితంగా దర్యాప్తు జరుగుతుంది అంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Official Statement from Jr NTR regarding the sudden demise of one of his fan #Shyam!@tarak9999 #JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/VNgPmF6Vr4
— Telugu FilmNagar (@telugufilmnagar) June 27, 2023