Idream media
Idream media
అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని నీటిపారుదల కాలువల ఆధునికీకరణ, సామరథ్యం పెంపు చేపడుతోందని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ ఛీప్ మురళీధర్ ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరాలతో కూడిన లేఖను కృష్ణా బోర్టు కార్యదర్శికి పంపారు. ఏపీ చేపట్టే పనులను నిలువరించాలని లేఖలో కోరారు.
తెలంగాణ తాజా ఫిర్యాదులు వీటిపై..
– పోతిరెడ్డి పాడు నుంచి ఆమోదం లేకుండానే 35 వేల క్యూసెక్కుల నీటిని అదనంగా తీసుకునేలా నది విస్తరణ పనులపై చర్యలు తీసుకోవాలని కోరినా ఏపీ ప్రభుత్వం పనులు చేపట్టిందని చీఫ్ ఇంజనీర్ లేఖలో పేర్కొన్నారు.
– కర్నూలులోని తుంగభద్ర నది కుడివైపు గుండ్రేవుల వద్ద, పులకుర్తి ఎత్తిపోతల పథకం సర్వే, నిర్మాణం, 15 సంవత్సరాల నిర్వహణకు అక్టోబర్ 16వ తేదీన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలానికి నీరు కాకుండా ఏపీ మళ్లించబోతోందని ఫిర్యాదు చేశారు.
– గుంటూరు జిల్లా దుర్గి వద్ద నాగార్జున సాగర్ కుడి కాలవపై బుగ్గవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3.4 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు పెంచేందుకు డీపీఆర్ తయారీకి ఏపీ ఉత్తర్వు ఇచ్చిందని, దీని వల్ల కేటాయించిన నీటి కంటే ఎక్కువ వాడుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
– ఈ ప్రాజెక్టులన్నీ ఏపీ 2014 తర్వాత బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా చేపడుతోందని, వీటి పనులను ఆపేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మురళీధర్ కృష్ణా బోర్డును కోరారు.